గిరిజనుల సంక్షేమానికి కృషి : ఐటీడీఏ పీవో అంకిత్‌

ABN , First Publish Date - 2022-12-13T00:30:39+05:30 IST

గిరిజనుల సంక్షేమానికి ఐటీడీఏ విశేష కృషి చేస్తోందని పీవో అంకిత్‌ అన్నారు.

గిరిజనుల సంక్షేమానికి కృషి : ఐటీడీఏ పీవో అంకిత్‌
ఐటీడీఏలో జరిగిన గిరిజన దర్బార్‌లో వినతులు స్వీకరిస్తున్న పీవో అంకిత్‌

ఏటూరునాగారం రూరల్‌, డిసెంబరు 12: గిరిజనుల సంక్షేమానికి ఐటీడీఏ విశేష కృషి చేస్తోందని పీవో అంకిత్‌ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన దర్బార్‌లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గిరిజన దర్బార్‌లో మొత్తం 25 మంది గిరిజనులు వినతులు సమర్పించారు. తాను డిగ్రీతోపాటు బీపీఈడీ పూర్తి చేశానని, జీవనోపాధి కోసం పీడీ ఉద్యోగాన్ని ఇప్పించాలని మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మట్వాడకు చెందిన ప్రేమ్‌కుమార్‌ కోరాడు. దామరవంచలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియమించాలని విజ్ఞప్తి చేశాడు. తమ గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీని నిర్మించాలని మంగపేట మండలం శనిగకుంట గ్రామస్థులు రవి, సునీత, మౌనిక, సరిత, ప్రేమలత, స్వప్న, వెంకన్న, కుమారి తదితరులు వినతి పత్రం అందజేశారు. తన వద్ద హక్కు పత్రం ఉన్నప్పటికీ రైతుబంధు పథకం వర్తించడం లేదని ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గ్రామానికి చెందిన కొరిసే రాములు తెలిపాడు. తనకు రైతుబంధు వర్తింపజేయాలని కోరాడు. మృతి చెందిన తన భర్తకు చెందిన భూమిని తన పేరుపై మార్చాలని గోవిందరావుపేట మండలం బుస్సాపూర్‌ గ్రామానికి చెందిన పాయం స్వరూప విజ్ఞప్తి చేసింది. విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను నియమించాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల దినసరి ఉద్యోగుల సంక్షేమ కమిటీ జిల్లా అధ్యక్షురాలు నాగలక్ష్మి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీవో వసంతరావు, జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డి, జేడీఎం కొండల్‌రావు, ఏసీఎంవో రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:30:41+05:30 IST