విద్యావ్యవస్థ అస్తవ్యస్తం
ABN , First Publish Date - 2022-12-12T00:25:44+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అనేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నియామకాలు జరగక పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లా వ్యాప్తంగా మండల విద్యాశాఖాధికారులు (ఎంఈవో)లు లేకపోవడంతో ఇన్చార్జీలతోనే సరిపెడుతున్నారు. సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిడితో న్యాయం చేయలేకపోతున్నారు.
జిల్లా శాఖలో పర్యవేక్షకుల కరువు
18 మండలాలకు ముచ్చటగా ముగ్గురే ఎంఈవోలు..
హెచ్ఎంలకే ఇన్చార్జీ ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు
పని ఒత్తిడితో కొరవడిన పర్యవేక్షణ
మహబూబాబాద్ ఎడ్యుకేషన్, డిసెంబరు 11 : రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అనేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నియామకాలు జరగక పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లా వ్యాప్తంగా మండల విద్యాశాఖాధికారులు (ఎంఈవో)లు లేకపోవడంతో ఇన్చార్జీలతోనే సరిపెడుతున్నారు. సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిడితో న్యాయం చేయలేకపోతున్నారు. తాజాగా ఏర్పాటైన సీనోలు, ఇనుగుర్తి మండలాలతో జిల్లాలో 18 మండలాలుండగా ముగ్గురే ఎంఈవోలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కొ ఎంఈవో కనిష్టంగా నాలుగు.. గరిష్టంగా ఎనిమిది మండలాలకు విద్యాధికారులుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వర్తించే గెజిటెడ్ హెచ్ఎంలకు ఇన్చార్జి ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పజెప్పడంతో వివిధ ఫైళ్లపై సంతకాలు పెట్టడానికి కూడా సమయం సరిపోవడం లేదని వాపోతున్నారు.
పని ఒత్తిడితో కొరవడుతున్న పర్యవేక్షణ....
జిల్లాలో 18 మండలాలకు ముగ్గురు మాత్రమే ఎంఈవోలుండడంతో విద్యాశాఖలో పర్యవేక్షణ కొరవడుతుంది. సర్వశిక్షా అభియాన్ ద్వారా అమలవుతున్న కార్యక్రమాల పర్యవేక్షణ, స్కూల్ కాంప్లెక్స్ నిర్వహణ ఎంఈవోల ప్రధాన విధులు. పాఠశాలల్లో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తూనే ఇతర మండలాలకు విద్యాధికారిగా పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో విరామం లేకుండా పనిచేయడంతో ఒత్తిడికి లోనవుతున్నారు. కేటాయించిన మండలాలకు కనీసం వారానికి ఒక మండలంలో కూడా పాఠశాలల్లో పర్యవేక్షించే పరిస్థితి లేకుండా పోతోంది. మండలంలో జరిగే ప్రత్యేక సమావేశాలకు మాత్రమే హాజరుకావాల్సి వస్తుందని వాపోతున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ, ఉపాధ్యాయుల అవసరాల రీత్యా అందుబాటులో ఉండకపోవడం, బియ్యాన్ని గోదాముల నుంచి పాఠశాలలకు తరలించేందుకు తీవ్ర ఒత్తిడికి లోనుకావాల్సి వస్తోందని ఇన్చార్జీ ఎంఈవోలు ఆందోళన చెందుతున్నారు.
పాత మండలాల నుంచే పర్యవేక్షణ..
జిల్లాల పునర్విభజన తర్వాత నూతనంగా ఏర్పడిన మండలాల కు పాత మండలాల నుంచే ఎంఈవోలు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన మండలాల్లో భవన నిర్మాణాలు లేకపోవడంతో పాత కార్యాలయాల నుంచే పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. దీంతో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయడం ఎంఈవోలకు భారంగా మారింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవ చూపి ప్రతి మండలానికి పూర్తిస్థాయి ఎంఈవోను నియమించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రెగ్యులర్ ఎంఈవోలను నియమించాలి : బి.పూల్చంద్, ఇన్చార్జ్ ఎంఈవో, మహబూబాబాద్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతు లు చేపట్టి రెగ్యులర్ ఎంఈవోలను నియ మించాలి. పాఠశాల విధులు నిర్వర్తిస్తూ నే ఎంఈవోగా అదనపు విధులు నిర్వ ర్తించాల్సి వస్తోంది. ఒక్కరికే ఒక్కటి కంటే ఎక్కువ మండలాలు కేటాయించ డం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో అందించలేక ఇబ్బందులు పడుతున్నాం. త్వరితగతిన పూర్తిస్థాయిలో మండలాలకు ఎంఈవో లను కేటాయించాలి.
మండలానికో ఎంఈవోను కేటాయించాలి : ఇస్లావత్ లచ్చిరాం, గెజిటేడ్ హెచ్ఎంల సంఘం, జిల్లా అధ్యక్షులు
ప్రతి మండలాని కి ఒక ఎంఈవోను కేటాయించాలి. మం డలాల పరిధిలో ఉన్న సీనియర్ గెజిటెడ్ ప్రధానో పాధ్యాయులకు పదోన్నతులు కల్పించి ఎంఈవోలుగా నియమించాలి. పూర్తిస్థాయిలో ఎంఈవో లు లేకపోవడం ద్వారా పాఠశాలల్లో పర్యవేక్షణ, ఉపాధ్యాయుల సమస్యలు సకాలంలో పరిష్కారం కాక ఇబ్బందు లు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఎంఈవోలను నియమించాలి.