మనకు మరో ప్రభుత్వ వైద్య కళాశాల
ABN , First Publish Date - 2022-11-15T00:17:45+05:30 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకి రానుంది. ఇప్పటికే హనుమకొండలో కాకతీయ ప్రభుత్వ వైద్యకళాశాల, దామెరలో ప్రతిమ వైద్యకళాశాల ఉండగా, తాజాగా మహబూబాబాద్లో మరో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
మహబూబాబాద్లో నూతనంగా అందుబాటులోకి...
నేడు హైదరాబాద్ నుంచి ప్రారంభించనున్న సీఎం
ఇప్పటికే హనుమకొండలో కాకతీయ, దామెరలో ప్రతిమ...
తాత్కాలికంగా నర్సింగ్ కళాశాల భవనంలో నిర్వహణ
ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్తో సహా 199 మంది ఉద్యోగుల నియామకం
మహబూబాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకి రానుంది. ఇప్పటికే హనుమకొండలో కాకతీయ ప్రభుత్వ వైద్యకళాశాల, దామెరలో ప్రతిమ వైద్యకళాశాల ఉండగా, తాజాగా మహబూబాబాద్లో మరో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి వర్చువల్ పద్ధతిన ప్రారంభించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జాటోతు వెంకటేశ్వర్లు చెప్పారు.
మహబూబాబాద్ శివారు బీసీ కాలనీ సమీపంలో గల 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.550 కోట్ల అంచనాలతో నిర్మాణంలో ఉన్న ఈ మెడికల్ కళాశాలకు మొదటి సంవత్సరం 150 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం 92 సీట్లు భర్తీ చేసుకుని మొదటి బ్యాచ్ తరగతుల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పాటు అనుబంధంగా వంద పడకల జిల్లా ఆస్పత్రిని 350 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసి వివిధ విభాగాలను నూతనంగా మంజూరు చేశారు. ఆయా వైద్య విభాగాల నిపుణులతో భర్తీ చేశారు.
మహబూబాబాద్ మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్, మెడికల్ సూపరింటెండెంట్తో సహా 199 మంది ఉద్యోగులు వైద్య విద్యను బోధించేందుకు సిద్ధంగా ఉన్నారు. పూర్తిస్థాయిలో మెడికల్ కళాశాల భవనాలు పూర్తి కాకపోవడంతో నర్సింగ్ కాలేజ్ కోసం నిర్మించిన భవనంలోనే తాత్కాలికంగా తరగతుల బోధన గదులను ఏర్పాటు చేసి నిర్వహణ చేపడుతున్నారు. ఇప్పటి వరకు విద్యాబోధన కోసం కేటాయించిన గదులలో తగిన ఫర్నిచర్ను ఏర్పాటు చేశారు. వీటికి తోడు ప్రాక్టికల్స్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ల్యాబ్ పరికరాలను సమకూర్చారు.
విద్యాబోధన కోసం అన్ని విభాగాలకు గాను డిపార్ట్మెంట్ హెచ్వోడీలను నియామకం చేశారు. ప్రిన్సిపాల్, మెడికల్ సూపరింటెండెంట్ల నిర్వహణలో 13 మంది ప్రొఫెసర్లు, 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, మరో 13 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 64 మంది సీనియర్ రెసిడెంట్లు, 42 మంది స్టాఫ్నర్సులు, 35 మంది మినిస్ట్రీరియల్ స్టాఫ్, ఐదుగురు పీహెచ్ఎన్/హెచ్ఈల పోస్టులు ఇప్పటికే భర్తీ చేశారు. కాగా, మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించడానికి అధికారులు ప్రైవేట్ భవనాలను సిద్ధం చేశారు. అబ్బాయిలకు జిల్లా కేంద్రంలోని వెంకట్రామా థియేటర్ ఎదురుగా ఉన్న ఓ అద్దెభవనం, అమ్మాయిలకు ఐఎంఏ హాల్ సమీపంలో ఉన్న భవనాలను కేటాయించారు.
కొత్త జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో మహబూబాబాద్లో కళాశాల అందుబాటులోకి వచ్చింది. జనగామ, భూపాలపల్లి జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరైనా ఇంకా అవి ఏర్పాట్ల దశలోనే ఉన్నాయి. వరంగల్ జిల్లాకు కూడా ప్రభుత్వ వైద్య కళాశాల హామీ ఉన్నప్పటికీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.