Sharmila vs Kavitha: డాటర్ ఆఫ్ వైఎస్సార్ వర్సెస్ డాటర్ ఆఫ్ కేసీఆర్..!

ABN , First Publish Date - 2022-11-30T19:25:34+05:30 IST

వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల (YSRTP President Sharmila) అరెస్ట్ తదనంతర పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ వదిలిన బాణం ‘షర్మిల’ అని టీఆర్‌ఎస్ ఘంటాపథంగా..

Sharmila vs Kavitha: డాటర్ ఆఫ్ వైఎస్సార్ వర్సెస్ డాటర్ ఆఫ్ కేసీఆర్..!

వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల (YSRTP President Sharmila) అరెస్ట్ తదనంతర పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ వదిలిన బాణం ‘షర్మిల’ అని టీఆర్‌ఎస్ ఘంటాపథంగా చెబుతోంది. ‘షర్మిల’ అరెస్ట్ జరిగిన తీరును ఖండించినందుకు టీఆర్‌ఎస్ ఇలాంటి దుష్ర్పచారం చేస్తోందని బీజేపీ బదులిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య ఇలాంటి మాటల యుద్ధం నడుస్తుంటే.. ‘షర్మిల’ మాత్రం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబమే లక్ష్యంగా వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. అరెస్ట్ అయి బెయిల్‌పై నివాసానికి చేరుకున్న అనంతరం ఆమె మరింత దూకుడు పెంచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏకంగా ‘తాలిబన్’ అని సంబోధిస్తూ షర్మిల ట్విట్టర్‌లో తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో.. గులాబీ పార్టీ నుంచి కూడా అంతే స్థాయిలో ప్రతి స్పందన వచ్చింది.

షర్మిల ఏ ట్విట్టర్‌నైతే వేదికగా చేసుకుని టీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తున్నారో.. అదే ట్విట్టర్ వేదికగా టీఆర్‌ఎస్ కూడా ఓ మహిళను రంగంలోకి దించింది. ఆ టీఆర్‌ఎస్ మహిళా నేత మరెవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత. దీంతో.. ఈ ట్విట్టర్ వార్.. డాటర్ ఆఫ్ వైఎస్సార్ వర్సెస్ డాటర్ ఆఫ్ కేసీఆర్ అనే రీతిలో సాగుతోంది. కల్వకుంట్ల కవిత బుధవారం ఉదయం షర్మిలను, బీజేపీని టార్గెట్ చేస్తూ పేర్లు ప్రస్తావించకుండా ఒక ట్వీట్ చేశారు. ఈ ఎపిసోడ్ ఆ ట్వీట్‌తో మొదలైంది.

తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” అని కవిత ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌లో దాగి ఉన్న నిగూడార్థాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. ‘‘బాణం’’ అంటే కవిత ఉద్దేశంలో షర్మిల. ‘‘జగనన్న వదిలిన బాణాన్ని’’ అని వైసీపీకి మద్దతుగా పాదయాత్ర చేసిన సందర్భంలో షర్మిల పదేపదే చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె అన్నతో సంబంధం లేకుండా పార్టీ పెట్టుకున్నప్పటికీ టీఆర్‌ఎస్, బీజేపీ మీరు వదిలిన బాణమంటే.. మీరు వదిలిన బాణమంటూ విమర్శించుకుంటూ జనాల దృష్టిలో షర్మిలను ఒక ‘‘బాణం’’గా మాత్రం ముద్ర వేశారు. షర్మిల మాత్రం తాను ఎవరు వదిలిన బాణాన్ని కాదని, తెలంగాణ కోడలినని పదేపదే చెబుతున్నారు. తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” అని కవిత ట్వీట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటంటే.. షర్మిల అరెస్ట్‌పై బీజేపీ నేతలు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించడాన్ని ఎద్దేవా చేయడం.

షర్మిలను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన తీరుపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ వైరుధ్యాలు.. పార్టీల సిద్ధాంతాలు ఎలా ఉన్నా.. ఒక మహిళను.. పార్టీ నాయకురాలి పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాల్సిందని అభిప్రాయపడ్డారు. షర్మిల కారులో ఉండగానే.. ఆ కారును టోయింగ్‌ చేస్తూ తరలించే దృశ్యాలను చూసి తీవ్రంగా కలతచెందానన్నారు. షర్మిల భద్రత, ఆమె ఆరోగ్యంపై గవర్నర్‌ ఆందోళన చెందినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించాయి. తమిళిసై సౌందర్‌రాజన్‌‌ను టీఆర్‌ఎస్ మొదటి నుంచి తెలంగాణ గవర్నర్‌గా కంటే కూడా బీజేపీ నేతగా చూస్తున్న విషయం విదితమే. కవిత తాజా ట్వీట్ కూడా తమిళిసై షర్మిల విషయంలో‌ స్పందించిన తీరుపై పరోక్షంగా వ్యంగ్యం సంధించినట్టేనని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా షర్మిల అరెస్ట్ జరిగిన తీరును ఖండించారు. ఇలా.. అరెస్ట్ విషయంలో షర్మిలకు మద్దతుగా నిలిచిన బీజేపీ నేతలను ఎద్దేవా చేసే ఉద్దేశంతోనే కవిత ఈ ట్వీట్ చేశారని స్పష్టమైంది.

టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై షర్మిల విమర్శలు చేస్తుంటే.. ఆ విమర్శలకు బీజేపీ వంత పాడుతోందనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కవిత ట్వీట్ ఉద్దేశంగా కనిపిస్తోంది. కవిత ట్వీట్‌కు షర్మిల కూడా ట్వీట్‌తో కౌంటర్ ఇచ్చారు. ‘‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’’ అని కవితను ఉద్దేశించి కాస్తంత వ్యంగ్యం జోడించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వార్ ఇంతటితో ఆగలేదు. షర్మిల చేసిన ఈ ట్వీట్‌పై కవిత కూడా అంతకు రెట్టింపు ట్వీట్‌తోనే బదులిచ్చారు. ‘‘అమ్మా.. కమల బాణం.. ఇది మా తెలంగాణం.. పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం.. మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు.. నేడు తెలంగాణ రూటు.. మీరు కమలం కోవర్టు.. ఆరేంజ్ ప్యారేట్టు.. మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను.. రాజ్యం వచ్చాకే రాలేదు నేను.. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి "కవిత"ను నేను ! అని సుదీర్ఘ ప్రాసలతో కూడిన పంక్తులతో షర్మిలకు కవిత కౌంటర్ ఇవ్వడంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది.

పైగా.. వైఎస్ కుటుంబానికి రాజకీయ పురిటిగడ్డ అయిన పులివెందుల ప్రస్తావనను కవిత తీసుకురావడం.. షర్మిలను పొలిటికల్ టూరిస్ట్ అని సంబోధించడంతో అందుకు ధీటుగా బదులిచ్చేందుకు వైఎస్సార్‌టీపీ కూడా సమాయత్తమవుతోంది. మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తున్న వారంతా.. మునుగోడు ఉప ఎన్నిక హీట్ తర్వాత చప్పగా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో షర్మిల వర్సెస్ కవిత ఎపిసోడ్ పొలిటికల్ హీట్‌ను పెంచిందని భావిస్తుందన్నారు.

సాంబశివారెడ్డి.పేరం

Updated Date - 2022-11-30T19:45:06+05:30 IST