యువకుడిని కాపాడిన యాచారం పోలీసులు
ABN , First Publish Date - 2022-11-01T00:02:37+05:30 IST
నగరంలోని అంబర్పేటలో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని దేవరకొండ వైపు వెళ్తుండగా మండలంలోని గున్గల్ గేటు వద్ద స్థానిక పోలీసులు గమనించి అతన్ని కాపాడారు.
యాచారం, అక్టోబరు 31: నగరంలోని అంబర్పేటలో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని దేవరకొండ వైపు వెళ్తుండగా మండలంలోని గున్గల్ గేటు వద్ద స్థానిక పోలీసులు గమనించి అతన్ని కాపాడారు. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్లోని నాగోర్ జిల్లాకు చెందిన ప్రవీణ్(30) నగరంలోని అంబర్పేటలోని సాయిహారతి ఎన్క్లేవ్ ఆపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఇతడికి నాగర్కర్నూల్ జిల్లా చారకొండకు చెందిన గీత అనే మహిళతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి జషిక, హిమాన్షి, అనే కుమార్తెలు, రితిక అనే బాలుడు ఉన్నారు. కొంతకాలంగా ఈ దంపతులు మధ్య కలహాలు ఏర్పడడంతో గీత తండ్రి రాజును పలుమార్లు మందలించాడు. ఈ క్రమంలో తనపై చేయి చేసుకున్నాడని బాధితుడు ప్రవీణ్ మానవహక్కుల కమిషన్లో తన మామపై ఫిర్యాదు చేశాడు. సోమవారం గీత తండ్రి రాజు, తమ మిత్రులు లక్ష్మణ్, రాములును వెంటపెట్టుకొని ప్రవీణ్ను బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని చారకొండ వైపు తీసుకెళ్తున్నారు. గున్గల్ గేటు వద్ద పోలీసులను చూసిన ప్రవీణ్ రక్షించండి.. రక్షించండి అంటూ బిగ్గరగా అరిచాడు. గమనించిన హెడ్కానిస్టేబుల్ శంకర్ ఇంటర్సెప్టార్ వాహనంతో ఆటోను వెంబడించి పట్టుకున్నారు. వారందరినీ పోలీ్సస్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. తనమామ వల్ల తనకు ప్రాణహాని ఉందని ప్రవీణ్ వాపోయాడు. ఈ ఘటనకు సంబంధించి సీఐ లింగయ్య అంబర్పేట పోలీసులకు వివరాలు తెలిపి బాధితుడు ప్రవీణ్, నిందితులు రాజు, లక్ష్మణ్, రాములును వారికి అప్పగించారు.