కొత్తబైక్ కొనుక్కొని వెళ్తుండగా..
ABN , First Publish Date - 2022-05-24T05:48:14+05:30 IST
కొత్తబైక్ కొనుక్కొని వెళ్తుండగా..
- ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి
మొయినాబాద్, మే 23: బతుకుదెరువుకు ఎడారి దేశానికి వెళ్లిన ఆ యువకుడు తిరిగి వారం రోజుల క్రితమే స్వదేశానికి వచ్చాడు. ఎన్నాళ్ల నుంచో కొత్త బైక్ కొనాలన్న అతడి కల నెరవేరిన కొద్ది క్షణాల్లోనే విధి అతడి ప్రాణాలనే బలిగొన్నది. ఈ విషాద ఘటన మొయినాబాద్ సమీపంలోని తాజ్హోటల్ సమీపంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన పి.శ్రీనివాస్(29) బతుకు దెరువుకోసం దుబాయ్వెల్లి వారం రోజుల క్రితం వచ్చాడు. కొత్త మోటారుసైకిల్ కొనుగోలు చేసేందుకు సోమవారం తన అన్న నర్సింహులు బైక్పై బండ్లగూడ కార్పోరేషన్ పరిదిలోని సన్సిటీ వెళ్లారు. అక్కడ కొత్త స్ప్లెండర్ బైక్ను కొనుగోలు చేశారు. అనంతరం కొత్తబైక్కు స్థానిక కాళీ మందిర్ వద్ద పూజలు సైతం చేయించారు. అదే బైక్పై ఇంటికి వెలుతుండగా మొయినాబాద్ సమీపంలోని తాజ్హోటల్వద్ద వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెలుతున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న శ్రీనివా్సకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి వెనకాల వేరే బైక్పై ఉన్న తన అన్న నర్సింహులు కళ్ల ముందే ఈ ప్రమాదం జరిగింది. తమ్ముడి మృతితో ఘటనాస్థలంలో అతడి రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్యా ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.