పార్వతమ్మకు పింఛన్ ఇప్పిస్తాం
ABN , First Publish Date - 2022-10-13T04:28:15+05:30 IST
పార్వతమ్మకు పింఛన్ ఇప్పిస్తాం
- అంధ్రజ్యోతి కథనానికి స్పందించిన ఎంపీ, జడ్పీ చైర్పర్సన్.. డీఆర్డీవో ఆఫీస్కు ఫోన్ చేసి ఆరా
బషీరాబాద్, అక్టోబర్ 12 : ‘పాపం.. పార్వతమ్మ!’ మానసిక వికలాంగురాలికి పింఛన్ మంజూరైనా అందని డబ్బులు అంటూ ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్లో బుధవారం ప్రచురితమైన కథనానికి చెవేళ్ల ఎంపీ జి.రంజిత్రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి స్పందించారు. ఈ విషయమై వారు సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. దివ్యాంగురాలికి పింఛన్ ఇవ్వకుంటే ఎలా..? మంజూరైనా డబ్బులు ఎందుకు అందడంలేదని వారు ప్రశ్నించినట్లు తెలిసింది. పింఛన్కు సంబంధించి అసలు ఏం జరిగిందనే దానిపై పరిశీలిస్తామని అశాఖ అధికారులు తెలిపారు. బషీరాబాద్ ఎంపీపీ కరుణఅజయ్ ప్రసాద్ ఎంపీడీవో రమే్షతో మాట్లాడి తెలుసుకున్నారు. డీఆర్డీవో కార్యాలయానికి సంబంధించిన అధికారి ఒకరూ బషీరాబాద్ ఎంపీడీవో కార్యాలయానికి ఫోన్ చేసి దివ్యాంగురాలి పింఛన్ మంజూరి వివరాలను తెలుసుకున్నారు. దివ్యాంగురాలికి సంబంధించిన ఆధార్కార్డు, పింఛన్ మంజూరీ పత్రాలను కార్యదర్శి లక్ష్మీకాంత్రెడ్డి ద్వారాఅధికారులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం చదివిన పలువురు అర్హులైన మానసిక దివ్యాంగురాలికి ప్రభుత్వం ఆసరా పింఛన్ ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.