మొయినాబాద్లో దొంగల బీభత్సం
ABN , First Publish Date - 2022-09-03T06:03:22+05:30 IST
మొయినాబాద్లో దొంగల బీభత్సం
- తాళం వేసి ఉన్న ఇంట్లో ఆభరణాలు, నగదు చోరీ
మొయినాబాద్, సెప్టెంబరు 2: మొయినాబాద్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళాలు పగులగొట్టి బంగారం, వెండితో పాటు నగదును ఎత్తుకెళ్లారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్దఉమ్మెంతాల్కు చెందిన గంజాయి కిష్టయ్య రెండు సంవత్సరాల క్రితం మొయినాబాద్లోని భరద్వాజ్ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసి కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఆగస్టు 28న ఇంటికి తాళంవేసి శేరిలింగంపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అదేనెల 31న గుర్తుతెలియని వ్యక్తులు ఇంటితాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిన 16.5 తులాల బంగారు ఆభరణాలు, 10తులాల వెండి, రూ.2లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అయితే ఇంట్లోకి ప్రవేశించడానికి ముందే ఇంటిబయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేశారు. కిష్టయ్య ఇంట్లోని సీసీ కెమెరాలు అతడి సెల్ఫోన్కు అనుసంధానమై ఉన్నాయి. సెప్టెంబరు 1న గురువారం సాయంత్రం కిష్టయ్య ఫోన్లో సీసీ కెమెరాలు పరిశీలించగా అవి పనిచేయలేదు. దీంతో మొయినాబాద్లో ఉండే అతడి బంధువులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి సీసీకెమెరాలను పరిశీలించాలని కోరాడు. అక్కడికి వెళ్లి చూసిన ఆ వ్యక్తి ఇంటి తాళాలు తెరిచి ఉండటాన్ని గమనించి కిష్టయ్యకు సమాచారం ఇచ్చారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.