ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-07-05T05:30:00+05:30 IST
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

- జాక్టో ఆధ్వర్యంలో డీఎస్ఈ కార్యాలయం ముట్టడి
కొడంగల్, జూలై 5: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, జాక్టో ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని డీఎ్సఈ కార్యాలయాన్ని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పవన్కుమార్, కొడంగల్ మండల ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ తదితరుల ఆధ్వర్యంలో ముట్టడించారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలతో పాటు అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదోన్నతుల అనంతరం ఫీడర్ క్యాడర్లలో ఏర్పడే ఖాళీలతో సహా మొత్తం ఖాళీలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలన్నారు. ప్రత్యక్ష నియామకాలు జరిగే లోపు విద్యాబోధనకు ఆటంకం కలగకుండా పాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలన్నారు. వేతనాలను ప్రతినెలా ఒకటో తేదీన విడుదల చేయాలన్నారు. సప్లిమెంటరీ బిల్లులను వరుస క్రమంలో జాప్యం లేకుండా మంజూర్ చేస్తూ ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులపట్ల డీఎ్సఈ వ్యవహార శైలిని మార్చుకోవాలన్నారు. సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, డీఎ్సఈ కార్యాలయంలో రెండు సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డీఎ్సఈ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టుచేసి స్టేషన్కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.