గ్రామాల అభివృద్ధే ధ్యేయం

ABN , First Publish Date - 2022-11-15T23:30:18+05:30 IST

గ్రామాల అభివృద్ధే తన ధ్యేయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.

 గ్రామాల అభివృద్ధే ధ్యేయం
వెంకటాపూర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే యాదయ్య

మొయినాబాద్‌ రూరల్‌/ చేవెళ్ల, నవంబరు 15: గ్రామాల అభివృద్ధే తన ధ్యేయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఎమ్మెల్యే చేపట్టిన ‘శుభోదయం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వెంకటాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కాలె యాదయ్య మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శుభోదయం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్‌, పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. బుధవారం(నేడు) మండలంలోని పామెన గ్రామంలో ఉదయం 6:30గంటలకు శుభోదయం కార్యక్రమం ప్రారంభమవుతుందని పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌ తెలిపారు.

‘శుభోదయం’ పేరిట ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

మొయినాబాద్‌ రూరల్‌, నవంబరు 15: శుబోదయం కార్యక్రమంతో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకోవడం లేదని బీజేపీ ఓబీసీ మోర్చ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్గని వెంకటేష్‌ గౌడ్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ. ఎమ్మెల్యే కాలె యాదయ్య శుభోదయం పేరిట గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడని విమర్శించారు. గ్రామాల్లో అనేక సమస్యలు ప్రజలను వెంటాడుతున్న పట్టించుకునే నాథుడే కారువయ్యాడన్నారు. బాకారం జాగీర్‌ గ్రామానికి బస్సు సర్వీసులను తగ్గించడంతో గ్రామస్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Updated Date - 2022-11-15T23:30:19+05:30 IST