దళితబంధులో తొలి విడత యూనిట్లు త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-09-09T05:07:42+05:30 IST
దళిత బంధు పథకంలో మొదటివిడతలోని లబ్ధిదారులకు
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి అర్బన్, సెప్టెంబరు 8 : దళిత బంధు పథకంలో మొదటివిడతలోని లబ్ధిదారులకు ఈనెల 20 వరకు యూనిట్లు పూర్త య్యేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ అధ్యక్షతన దళితబంధు పథకంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దళిత బంధు పథకం కింద మొదటి విడతలో 697 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. 610 మంది లబ్ధిదారులు తమ యూనిట్లను గ్రౌండింగ్ చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికీ పనులు చేపట్టని వారి వివరాలను ఎమ్మెల్యేలకు అందించి వారి సమన్వయంతో పనుల వేగవంతానికి కృషి చేయాలన్నారు. వారానికోసారి శాసన సభ్యులు సమయం తీసుకుని జిల్లాలో దళితబంధు పథకం కింద ఇచ్చిన లక్ష్యాలను ఈనెల 20లోపు పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. దళితబంధు రెండో విడతలో నియోజవర్గానికి 500మంది లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఆ దిశగా శాసన సభ్యులు జాబితాలను సత్వరమే జిల్లా యంత్రాగానికి అందజేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, అదనపు కలెక్టర్లు తిరుపతిరావు, ప్రతీక్జైన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్కుమార్, పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప, మెప్పా పీడీ శ్రీపాద రామేశ్వరం, అధికారులు పాల్గొన్నారు.
హామీల అమలుకు పెద్దపీట
కందుకూరు : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను గురువారం బజ్బార్గూడ, బేగంపేట, మాదాపురం, రాచులూరు, తిమ్మాపురం గ్రామాల 266మంది లబ్ధిదారులకు తిమ్మాపురంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు గురైనా సంక్షేమ పథకాల అమలులో ఇబ్బంది కలగకుండా కేసీఆర్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 46లక్షల మందికి పెన్షన్లు వచ్చేవన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో 20లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. కందుకూరు మండలానికి నూతనంగా 1,728మందికి పెన్షన్లు మంజూరైనట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న మరికొందరికి మంజూరు కావాల్సి ఉందని, త్వరలో వారికి అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో కిడ్నీ, బోధకాల వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరు చేయడానికి సీఎం కార్యాచరణ రూపొందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, వైస్ఎంపీపీ గంగుల శమంతప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్, వైస్ చైర్మన్ జి.విజయేందర్రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎస్.రాజశేఖర్రెడ్డి, సర్పంచ్ జి.గోపాల్రెడ్డి, మాజీ ఎంపీపీ వట్నాల శోభేశ్వర్గౌడ్, సర్పంచ్లు శ్రీనివాసచారి, గోవర్ధన్, మంద సాయిలు, ఎంపీటీసీలు బాల్రాజ్, రేఖ, జురేష్, కాకి రాములు, నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, కాకి దశరథ, ఎస్.లచ్చానాయక్, రాజు, మన్నె జయేందర్ముదిరాజ్, కె.సదానంద్గౌడ్, సామ ప్రకాశ్రెడ్డి, ఆర్.యాదయ్య, పొట్టి ఆనంద్, సామ మహేందర్రెడ్డి, ఎంపీడీవో వెంకట్రాములు పాల్గొన్నారు.