అభివృద్ధి పనులకు చర్యలు చేపట్టాలి
ABN , First Publish Date - 2022-12-06T23:43:30+05:30 IST
వికారాబాద్ మునిసిపల్ పరిధిలో కొత్త ప్రతిపాదనలతో అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని మునిసిపల్ డైరెక్టర్ సత్యనారాయణ సంబంధిత అధికారులకు సూచించారు.
మునిసిపల్ డైరెక్టర్ సత్యనారాయణ
వికారాబాద్, డిసెంబరు 6: వికారాబాద్ మునిసిపల్ పరిధిలో కొత్త ప్రతిపాదనలతో అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని మునిసిపల్ డైరెక్టర్ సత్యనారాయణ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, పబ్లిక్ హెల్త్ ఈయ్ససీ, ఎస్ఈలతో కలిసి వికారాబాద్ మునిసిపల్ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. వికారాబాద్ మునిసిపల్ పరిధిలో కొత్త ప్రతిపాదనలతో రోడ్డు వైన్డింగ్, సెంట్రల్ లైటింగ్ పనులతో పాటు జంక్షన్ల వద్ద అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్తగా డివైడర్లు, రైల్వేవంతెన, అర్బన్ పార్కు అభివృద్ధితో పాటు జంక్షన్ల వద్ద ఉన్న పాత విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. శివసాగర్ చెరువు అభివృద్ధి పనులతో పాటు వికారాబాద్ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్న సమీకృత మార్కెట్ యార్డులు, వైకుంఠధామాల పనులను ఫిబ్రవరి వరకు పూర్తి చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ పెంచాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, మునిసిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మునిసిపల్ డీఈ, ఏఈ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పట్టణంలో పర్యటించిన ప్రత్యేక బృందం, ఎంపీ, ఎమ్మెల్యే
అంతకు ముందు అనంతగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేటీఆర్ బృందంతో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అనంతరం అభివృద్ధిలో భాగంగా వికారాబాద్ పట్టణంలో పర్యటించారు. అనంతగిరి ఆలయ అభివృద్ధి, అనంతగిరి పర్యాటక కేంద్రం, మెడికల్ కళాశాల నిర్మాణం అంశాలు, మన్నెగూడ-అనంతగిరి వరకు, బీజేఆర్చౌరస్తా-కొత్తగడి, బుగ్గవరకు, ఎన్నెపల్లి-మద్గుల్ చిట్టంపల్లి వరకు రోడ్లు ప్రధాన కూడలీల నిర్మాణం, బ్లాక్ గ్రౌండ్లో సౌకర్యాలు, శివారెడ్డిపేట చెరువు మిని ట్యాంక్ బండ్నిర్మాణం, వికారాబాద్కు కావాల్సిన అభివృద్ధి నివేదికలను తయారు చేస్తున్నామని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. ఇంత త్వరగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు పూనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్ , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.