అనుబంధాల రాఖీ
ABN , First Publish Date - 2022-08-12T05:27:52+05:30 IST
అనుబంధాల రాఖీ
- నేడు రాఖీపౌర్ణమి
- భారీగా వెలిసిన దుకాణాలు
- బిజీబిజీగా యువతులు, మహిళలు
మేడ్చల్, ఆగస్టు 11, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/వికారాబాద్ : అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఆనందంగా జరుపుకునే మహోత్తరమైన పండుగ రాఖీపౌర్ణమి.శుక్రవారం రక్షాబంధన్ వేడుకలకు జరుపుకునేందుకు వికారాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరిజిల్లాల ప్రజలు సిద్ధమయ్యారు. అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు తోబుట్టువులు తమతమ పుట్టిళ్లకు చేరుకుంటున్నారు. మేడ్చల్, వికారాబాద్ జిల్లా ప్రజలు సైతం పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధ్దమవుతుండగా ఇప్పటికే పట్టణాల్లో రాఖీ దుకాణాలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. రూ.1 నుంచి రూ.500 ఆపై ధరలల్లో వివిధ రకాల రాఖీలు లభ్యం అవుతుండగా కొనుగోళ్లతో రాఖీల దుకాణాలు మహిళలతో రద్దీగా మారాయి.
ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు : మంత్రులు
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పర్వదినాన్ని ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని మంత్రులు ఆకాంక్షించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సమయంలో రాఖీ పండుగ జరుపుకోవడం శుభపరిణామమని, వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న రక్షాబంధన్ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములై ఆత్మీయతతో పాటు జాతీయ స్ఫూర్తిని చాటాలని పిలుపు నిచ్చారు.