నామమాత్రంగా..
ABN , First Publish Date - 2022-01-24T05:11:15+05:30 IST
నామమాత్రంగా..
- జిల్లా వ్యాప్తంగా భారీగా తగ్గిన కరోనా నిర్ధారణ పరీక్షలు
- కేంద్రాలకు వచ్చిన వారందరికీ టెస్ట్లు చేయాలని డిమాండ్
వికారాబాద్, జనవరి23 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): వికారాబాద్ జిల్లాలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తగ్గించారు. ఆదివారం జిల్లాలోని చాలా కేంద్రాల్లో పరీక్షలు నామమాత్రంగా చేశారు. శుక్రవారం 1,532 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 264 పాజిటివ్ వచ్చింది. శనివారం 1,640 మందికి పరీక్ష చేయగా 326 పాజిటివ్ కేసులొచ్చాయి. ఆదివారం 895 మందికే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 135 పాజిటివ్ కేసులు వచ్చాయి. పరీక్షల తగ్గింపుతోనే పాజిటివ్ కేసులు పడిపోయాయి. కొవిడ్ఉధృతి నేపథ్యంలో కేంద్రాలకు వచ్చిన వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.
- నామమాత్రంగా కరోనా టెస్ట్లు
తాండూరు నియోజకవర్గం పరిధిలో 298 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 72 మందికి పాజిటివ్ వచ్చింది. వికారాబాద్ నియోజకవర్గం పరిధిలో 322 మందికి పరీక్షలు నిర్వహించగా 16 పాజిటివ్ కేసులు వచ్చాయి. పరిగి నియోజకవర్గంలో 182 మందికి పరీక్షలు నిర్వహించగా 38, కొడంగల్ నియోజకవర్గంలో 93మందికి పరీక్షలు చేయగా 9 మందికి చొప్పున కరోనా పాజిటివ్ వచ్చింది.
- ఇంటింటి సర్వేలో 153 మందికి పాజిటివ్ గుర్తింపు
జిల్లాలో ఆదివారం వరకు మూడు రోజులు నిర్వహించిన ఇంటింటి జర్వసర్వేలో 91,573 గృహాలను సందర్శించి 4,121మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు ఆరోగ్య బృందాలు గుర్తించాయి. వారిలో 1,783మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 153మందికి పాజిటివ్ వచ్చింది.
- 2,911 మందికి వ్యాక్సినేషన్
కాగా ఆదివారం 2,911 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. 15-18ఏళ్లలోపు వారిలో 128 మందికి మొదటి డోస్, 18ఏళ్లు పైబడిన వారిలో 248మందికి మొదటి డోస్, 2523 మందికి రెండో డోస్ ఇచ్చారు. ఇదిలా ఉంటే 60ఏళ్లు పైబడిన 12మందికి ప్రికాషనరీ డోస్ ఇచ్చారు.