మండల సమావేశం వాయిదా
ABN , First Publish Date - 2022-09-30T05:44:59+05:30 IST
మండల సమావేశం వాయిదా
కీసర, సెప్టెంబరు 29 : మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. గురువారం కీసర మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారాయణ అధ్యక్షతన సమావేశం జరిగింది. కాగా, సమావేశానికి ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు సమయానికి హాజరుకాగా, ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. అయితే, తమకు నిధులు కేటాయించాలని గత మూడు సమావేశాల సందర్భంగా అధికారులను అడుగుతున్నా నిర్లక్ష్యం చేస్తున్నారనే కారణంతో ఎంపీటీసీలు సమావేశానికి హాజరుకాలేదు. గత రెండు సమావేశాలకు వచ్చి సమావేశాన్ని బహిష్కరించిన సమయంలో స్థానిక జడ్పీటీసీ, జడ్పీ వైస్చైర్మన్ వెంకటేష్ కల్పించుకొని.. మమ్మల్ని బలవంతంగా సమావేశంలో కూర్చొబెట్టారని, లేదంటే మంత్రి మల్లారెడ్డితో ఫోన్ చేపిస్తానని బెదిరించే యత్నం చేశాడని పలువురు ఎంపీటీసీలు అసహనం వ్యక్తం చేస్తూ వివరణ ఇచ్చారు. కాగా, గంట సేపు సమావేశాన్ని వాయిదా వేసినా.. సభ్యులు హాజరుకాకపోవడంతో ఎంపీపీ ఆదేశాల మేరకు ఎంపీడీవో పద్మావతి సమావేశాన్ని వాయిదా వేశారు.