‘దళితబంధు’ కొత్త లబ్ధిదారుల జాబితా అందజేయాలి

ABN , First Publish Date - 2022-09-08T05:15:20+05:30 IST

‘దళితబంధు’ కొత్త లబ్ధిదారుల జాబితా అందజేయాలి

‘దళితబంధు’ కొత్త లబ్ధిదారుల జాబితా అందజేయాలి
దళితబంధుపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతున్న విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి

వికారాబాద్‌, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దళితబంధు పథకం రెండో విడత ఒక్కో నియోజకవర్గం నుంచి 500 మంది లబ్దిదారులను ఎంపికచేస్తామని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో దళితబంధుపై కలెక్టర్‌ నిఖిల అధ్యక్షతన జరిగిన సమన్వయ సమావేశానికి మంత్రి, జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, రోహిత్‌రెడ్డి, యాదయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. దళితబంధు కొత్త లబ్ధిదారుల జాబితాను జిల్లా యంత్రాంగానికి అందజేయాలని కోరారు. లబ్ధిదారులు ఖాదీ, చిన్నపరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి కనబర్చేలా ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించాలన్నారు. మొదటివిడత లబ్ధిదారుల యూనిట్లన్నీ గ్రౌండింగ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. దళితబంధు కింద ఇప్పటి వరకు రాష్ట్రంలో 38,551 కుటుంబాలకు లబ్ధిపొందాయని తెలిపారు. మొదటి విడతలో జిల్లాలో 358 మందిని ఎంపిక చేయగా, 178యూనిట్లు గ్రౌండింగ్‌ అ య్యాయని, పనులు ప్రారంభించని వారి వివరాలను ఎమ్మెల్యేలకు తెలిపి పూర్తయ్యేలా కృషిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు. మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం చేపట్టే వారు షెడ్ల నిర్మాణాలు పూర్తిచేసి యూనిట్లు ప్రారంభించేలా చూడాలన్నారు. పౌలీ్ట్ర దిశగా ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో కందిపప్పు డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులు సంఘాలుగా ఏర్పడి దాల్‌ మిల్లులు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. అలాగే మిర్చి, పసుపు, అల్లం, వెల్లుల్లి వంటి ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్రోత్సహించి సూపర్‌ మార్కెట్ల ద్వారా విక్రయించేలా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్‌వో అశోక్‌కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబూ మోజెస్‌, జిల్లా వ్య వసాయ శాఖాధికారి గోపాల్‌, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌, పరిశ్రమల శాఖ అధికారి పాల్గొన్నారు.

Updated Date - 2022-09-08T05:15:20+05:30 IST