ఆరుట్ల హిల్స్‌ రిసార్టులో మద్యం పార్టీ

ABN , First Publish Date - 2022-09-29T05:06:47+05:30 IST

మంచాల మండలం ఆరుట్ల హిల్స్‌ రిసార్టులో మంగళవారం

ఆరుట్ల హిల్స్‌ రిసార్టులో మద్యం పార్టీ
పార్టీ జరిగిన ఆరుట్ల హిల్స్‌ రిసార్టు

  • 16 మంది యువతీ యువకులపై కేసు 
  • కొనసాగుతున్న దర్యాప్తు


మంచాల, సెప్టెంబరు 28: మంచాల మండలం ఆరుట్ల హిల్స్‌ రిసార్టులో మంగళవారం అర్ధరాత్రి మద్యం పార్టీ కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 20మంది యువతీయువకులు ఆరుట్ల సమీపంలోని ఆరుట్ల హిల్స్‌ రిసార్టుకు మంగళవారం రాత్రి చేరుకున్నారు. బుధ వారం తెల్లవారుజామున అటుగా వెళ్తున్న స్థానికులు రిసార్ట్‌లో అరుపులు, కేకలు విని లోనికి వెళ్లి చూశారు. రిసార్టు స్విమ్మింగ్‌పూల్‌లో కొంతమంది యువతీయువకులు స్నానం చేస్తూ కనిపించారు. ఆ స్థలంలో ఖాళీ మద్యం సీసాలు, తినుబండారాలు గమనించారు. అలాగే ధూమపానానికి సంబంధించిన పరికరాలనూ గుర్తించారు. దీంతో స్థానికులు వెంటనే రిసార్టులో జరుగుతున్న తతంగంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రిసార్టుకు చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై సీఐ వెంకటేష్‌ మాట్లాడుతూ.. పలు కళాశాలల విద్యార్థులు ఇక్కడ నైట్‌ పార్టీ చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. రిసార్టు నిర్వాహకుడు రేవంత్‌రెడ్డితో పాటు మరో 15మందిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా రిసార్టుల్లో ఏ పార్టీలూ నిర్వహించవద్దని, అలా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఆరుట్ల హిల్స్‌ రిసార్టులో మద్యంపార్టీ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంస్కృతికి ఇక్కడికి తీసుకొస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఫామ్‌ హౌస్‌లపై నిఘా పెంచాలని కోరుతున్నారు.



Updated Date - 2022-09-29T05:06:47+05:30 IST