మైనింగ్ ఏర్పాటు చేస్తే ఊరుకోం
ABN , First Publish Date - 2022-11-23T23:37:19+05:30 IST
ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా యాచారం మండలంలో మైనింగ్జోన్ ఏర్పాటు చేయనిచ్చేది లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
తమది పేదల ప్రభుత్వం
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
యాచారం, నవంబరు 23 : ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా యాచారం మండలంలో మైనింగ్జోన్ ఏర్పాటు చేయనిచ్చేది లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్రంలో బుధవారం 51 మందికి కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను ఆయన అందించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లా డారు. మైనింగ్ ఏర్పాటు చేయడం వలన వ్యవసాయరంగం పూర్తిగా కుంటు పడుతుందన్న విషయం తనకు తెలుసని, ఈ విషయంలో ఎవరిమాటా వినేది లేదని పేర్కొన్నారు. తమది పేదల ప్రభుత్వమని, ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను ముందుంటానని చెప్పారు. మైనింగ్జోన్ కోసం అబ్దుల్లాపూర్మెట్లో 680 హెక్టార్ల భూమి కేటాయించామని తెలిపారు. మెట్రోజోన్లో ఉన్న ప్రాంతంలో మైనింగ్జోన్ ఏర్పాటుకు తానుపూర్తిగా వ్యతిరేకమన్నారు. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు సీఎం కేసీఆర్తో మాట్లాడి రైతులకు అండగా ఉంటానన్నారు. క్రషర్లు, క్వారీల కారణంగా వాతావరణ కాలుష్యం కావడంతోపాటు పంటలు దెబ్బతింటాయని తెలిసినా అఽధికారులు ఎందుకు అనుమతి ఇచ్చారో తెలవడం లేదన్నారు. ఈ ఏడాది మండలంలో ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ కింద రూ.14కోట్ల 66లక్షల సాయమందించామని ఎమ్మెల్యే చెప్పారు. మైనింగ్పై ఈనెల 26న ప్రజాభిప్రాయసేకరణ సభ ఉందని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎంపీపీ కొప్పు సుకన్యబాషా ఎమ్మెల్యేను కోరారు. సమావేశంలో జడ్పీటీసీ జంగమ్మ, తహసీల్దారు సుచరిత, ఎంపీడీవో విజయలక్ష్మి, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. ఈసందర్భంగా యాచారం మండలంలో మైనింగ్జోన్ ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.