బలవర్ధకం మిథ్యే!
ABN , First Publish Date - 2022-04-28T05:10:59+05:30 IST
బలవర్ధకం మిథ్యే!
- ఫపిల్లల్లో పోషక లోపాలు
- ఫజిల్లాలో 3,435 మంది గుర్తింపు
- ఫపోషక లోపాలున్న పిల్లలకు డబుల్ రేషన్ ఇస్తున్న ఐసీడీఎస్
- ఫబలహీన చిన్నారులకు ప్రత్యేక హెల్త్ కార్డులు
మేడ్చల్, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆహారంలో సూక్ష్మపోషక విలువలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. గర్భం దాల్చిన మహిళ విశ్రాంతి లేక పోషకాహారం తీసుకోక, కాన్పు సమయంలో ఎక్కువ రక్తం పోయి తల్లి నుంచి శిశువులకు పోషకాలందడం లేదు. దీంతో చాలా మంది చిన్నారులు పోషక విలువల లోపాలతో బాధపడుతున్నారు. పోషకాలు లోపించిన పిల్లలు మేడ్చల్ జిల్లాలో 3435 మంది ఉన్నట్టు గుర్తించారు. ఇలాంటి పిల్లలకు డబుల్ రేషన్ ఇస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నా డబుల్ రేషన్ ఇచ్చే విషయంలో మాత్రం స్పష్టత లేదు. తల్లీ పిల్లల ఆరోగ్యంపై ఎప్పకటిప్పుడు వాకబు చేయాల్సిన అంగన్వాడీ టీచర్లు, అయాలు, సూపర్వైజర్లు పోషక లేమి పిల్లలపై అంతగా శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి.
డబుల్ రేషనింగ్
పోషక లోపం పిల్లలను గుర్తించి వారికి డబుల్ రేషన్ ఇస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి అక్కేశ్వర్రావు తెలిపారు. సాధారణ పిల్లలకు ఇచ్చే పోషకాల్లో భాగంగా రోజూ 100ఎంఎల్ పాలు, 37.5 గ్రాముల బియ్యం, ఏడు గ్రామల పప్పు, 2.5గ్రామల నూనె, ఒక కోడిగుడ్డు ఇస్తారు. ఈ మొత్తాన్ని పోషక విలువల లేమి పిల్లలకు రెట్టింపు ఇస్తున్నామని అంగన్వాడీ, ఐసీడీఎస్ సిబ్బంది పేర్కొంటున్నారు. అలాగే మహిళ గర్భం దాల్చింది మొదలు తొమ్మిది నెలల పాటు పాలు, కోడిగుడ్లు, రైస్దాల్, అకుకూరలు, కూరగాలయలతో భోజనం అందజేస్తారు. అదనంగా 200గ్రాముల పెరుగు ఇస్తున్నామని చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. గర్భిణులకు, పోషకలేమి పిల్లలకు డబుల్ రేషన్ ఇచ్చే విషయంలో లబ్ధిదారులు సంతృప్తి చెందడం లేదు. నిబంధనల ప్రకారం ఇస్తున్నామని క్షేత్రస్థాయి అధికారులు పేర్కొంటున్నా తమకు అందడం లేదని, అంగన్వాడీలు అందరికీ ఒకేలా పోషకాహారం పంపిణీ చేస్తున్నారని గర్భిణులు, బలహీన చిన్నారుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. సిబ్బంది చెబుతున్నదానిలో నిజముందా? లేదా? అనేది తేలాలంటే కలెక్టర్ నేతృత్వంలో ఉన్నతాధికారులు పర్యవేక్షణ జరిపితే స్పష్టత వస్తుంది. ఒక వేళ నిబంధనల మేరకు పోషకవిలువలు గల ఆహారం అందకుంటే అధికారులు పర్యవేక్షణలో పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అంగన్వాడీల వారీగా పరిశీలిస్తేనే మెరుగైన ఆహారం అంది ప్రభుత్వ లక్ష్యం నెరవేరే ఆస్కారం ఉంది.
పోషకలేమి చిన్నారుల గుర్తింపు
జిల్లాలో 790 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలకు 78,087 మంది పిల్లలు వస్తున్నట్లు రికార్డులు చూపుతున్నారు. కత్బుల్లాపూర్ ఐసీడీస్ ప్రాజెక్టు పరిధి 313 అంగన్వాడీ కేంద్రాల్లో 33,085 మంది పిల్లలు, మేడ్చల్ ప్రాజెక్టులో 211 కేంద్రాల్లో 16,785మంది పిల్లలు, అల్వాల్ పరిధి 269 అంగన్వాడీ కేంద్రాల్లో 28,217 మంది చిన్నారులు ఆహారం పొందుతున్నారు. జిల్లాలో తీవ్ర పోషక లేమితో బాధపడుతున్న పిల్లలు 1809 మంది, తీవ్ర పోషక లోపాలతో బాధ పడుతున్న పిల్లలు 1626 మంది, అధిక బరువు కలిగిన పిల్లలు 2208 మంది, స్థూలకాయం ఉన్న పిల్లలు 1,365 మంది ఉన్నట్టు గుర్తించారు.
పోషణలేమి పిల్లలకు హెల్త్కార్డులు..
సామాన్య, మధ్యతగరతి, పేదల కోసం ప్రభుత్వం పిల్లలకు, తల్లులకు అవసరమైన పోషక విలువలతో కూడ బోజనాలు అందించడానికి, పిల్లల్లో సృజన్మాతక పెంపోదించడానికి అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చె పిల్లలకు సంబంధించి ఎత్తు, బరువు ప్రతి నెల పరీక్షలు నిర్వహిస్తారు. ఎత్తుకు సరిపడా బరువు లేనపుడు, బరువుకు తగ్గ ఎత్తు లేనపుడు పిల్లలను పోషక విలువలు లేని పిల్లలుగా గుర్తిస్తారు. ఇలాంటి పిల్లలను అంగన్వాడీ కేంద్రం వారిగా గుర్తిస్తారు. ఇప్పటికే ఇలాంటి గుర్తింపుకు అన్ని చర్యలు పూర్తి అయ్యాయి. డబుల్ రేషన్తోపాటు కొత్తగా పోషక లేమి పిల్లలకు హెల్త్ కార్డులు కూడ ఇవ్వనున్నట్లు ప్రాజెక్టు అధికారి అక్కెశ్వర్రావు చెపుతున్నారు. ప్రతి నెల పిల్లను పరీక్షించి వారికిచ్చిన హెల్త్కార్డులో వివరాలను తల్లిదండ్రులకు అందిస్తున్నారు. ఈ కార్డులను పరిశీలించి పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద పెడుతారని హెల్త్కార్డులను తీసుక వచ్చినట్లు అధికారులు చెపుతున్నారు. దేశానికి పౌరులుగా ఎదిగే చిన్న పిల్లల్లో పోషక లేమిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ముంది.