కోర్టు ఉత్తర్వులతో ఆగిన ఉపసర్పంచ్ ఎన్నిక
ABN , First Publish Date - 2022-07-01T06:25:17+05:30 IST
కోర్టు ఉత్తర్వులతో ఆగిన ఉపసర్పంచ్ ఎన్నిక
మొయినాబాద్, జూన్ 30: కోర్టు ఉత్తర్వులతో నాగిరెడ్డిగూడ ఉపసర్పంచ్ ఎన్నిక ఆగింది. ప్రస్తుత ఇన్చార్జి సర్పంచ్ సురేందర్గౌడ్పై అవిశ్వాసం పెడుతున్నట్లు జూన్ 3న వార్డుసభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి జూన్ 30న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్డీవో వేణుమాధవరావు జూన్ 7న నోటీసులు జారీచేశారు. ముందుగా నోటీసులు జారీచేసిన ప్రకారం గురువారం నాగిరెడ్డిగూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, 7వ వార్డుసభ్యురాలు రూతమ్మ సమావేశానికి ఆలస్యంగా రావడంతో ఆమెను అనుమతించలేదు. ఉపసర్పంచ్తో పాటు మిగతా సభ్యులంతా సమయానికే వచ్చారు. ఉపసర్పంచ్పై 8వవార్డు సభ్యురాలు బంటు లక్ష్మమ్మ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఎంతమంది సభ్యులు మద్దతు తెలుపుతున్నారని ఆర్డీవో అడగడంతో ఏడుగురు చేతులెత్తి ఆమోదించారు. కానీ ఉపసర్పంచ్ ఎన్నికకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఉన్నందున సమావేశం తీర్మానం వివరాలు వెల్లడించలేదు. జూలై 11 వరకు ఉపసర్పంచ్, ప్రస్తుత ఇన్చార్జి సర్పంచ్ సురేందర్గౌడ్ విధుల్లో ఉంటారని, కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత పూర్తి ప్రక్రియ జరుగుతుందని ఆర్డీవో చెప్పారు.