ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కలేనా?
ABN , First Publish Date - 2022-02-14T05:19:05+05:30 IST
మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు
- హామీలకే పరిమితం
- ఉన్నత విద్యకు పేద విద్యార్థులు దూరం
తలకొండపల్లి , ఫిబ్రవరి 13: మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. కళాశాల అందుబాటులో లేక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. విధిలేక ఆమనగల్లు, మిడ్జిల్, షాద్నగర్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లి వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రైవేట్ కాలేజీలో చదివించాల్సి వస్తుందని పలువురి విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. డబ్బులు కట్టలేని వారు పదోతరగతితోనే చదువు ఆపేస్తున్నారు. తలకొండపల్లి, వెల్జాల్, గట్టిప్పలపల్లి, చంద్రధన, పడకల్, చుక్కాపూర్, రాంపూర్, ఖానాపూర్ గ్రామాలలో పైచదువులు చదవడానికి కళాశాల లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాల ఏర్పాటు గురించి విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని వాపోతున్నారు. పలు మార్లు మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులకు విన్నవించినా కళాశాల ఏర్పాటుకు నోచుకోలేదన్నారు. ఇప్పటికైనా మండల కేంద్రంలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటుకు స్థానిక ప్రజాప్రతినిధులు. అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.