గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-09-20T05:25:40+05:30 IST

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
శివ మృతదేహం

కడ్తాల్‌, సెప్టెంబరు 19: మండలంలోని మైసిగండి శివాలయం ఎదుట కోనేరులోకి దిగి యువకుడు గల్లంతైన యువకుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. కడ్తాల పోలీసులు, మహేశ్వరం అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టి సాయంత్రం మృతదేహాన్ని వెలికి తీశారు. హైదరాబాద్‌ వనస్థలిపురం చింతలకుంట ప్రాంతానికి చెందిన గొల్లకొండ శివ(22) ఆదివారం వినాయక నిమజ్జనం అనంతరం సుమారు 30మంది తన స్నేహితులతో కలిసి కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ ఆలయానికి దర్శనానికి వచ్చాడు. అమ్మవారి దర్శనం చేసుకొని భోజనం అనంతరం సాయంత్రం 5గంటలకు స్థానిక శివ రామాలయం ఎదుట ఉన్న కోనేరులో దిగి గల్లంతయ్యాడు. పక్కనే ఉన్న స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. కడ్తాల ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌, మహేశ్వరం అగ్నిమాపక ఎస్‌ఐ మహేశ్‌, తమ సిబ్బందితో కలిసి కోనేరు వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టిన రాత్రి వరకు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సోమవారం ఉదయం కోనేరుకు ఐదు మోటర్లతో సగానికిపైగా నీటిని తొలగించారు. అయినా మృతదేహం లభ్యం కాకపోవడంతో 10మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం మైసిగండి కోనేరు వద్దకు చేరుకొని రంగంలోకి దిగింది. మినీ బోట్ల సాయంతో సాయంత్రం కోనేరు నుంచి శివ మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌ తెలిపారు. కాగా కోనేరు వద్దకు శివ కుటుంబీకులు, బంధువులు, స్థానికులు పెద్దఎత్తున చేరుకున్నారు. 

Updated Date - 2022-09-20T05:25:40+05:30 IST