‘అనుమతి లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలి’
ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST
‘అనుమతి లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలి’
వికారాబాద్, సెప్టెంబరు 10 : తాండూరు మండల పరిధిలోని కరన్కోట్లో ప్రభుత్వ అనుమతి లేకుండా కొనసాగుతున్న కృష్ణవేణి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వివేకానంద విద్యాలయ కరస్పాండెంట్ జ్ఞానేశ్వర్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవిని కోరారు. ఈమేరకు శనివారం డీఈవోను ఆమె కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరన్కోట్ గ్రామంలో 2004వ సంవత్సరం నుంచి వివేకానంద విద్యాలయ పాఠశాలను సమర్ధవంతంగా నిర్వహించామని, కొన్ని కారణాల వల్ల పాఠశాల నిర్వహణ బాధ్యతలను ఉపాధ్యాయురాలు కీర్తికి అప్పగించినట్లు తెలిపారు. ఆ సమయంలో పాఠశాలను మూడు నెలలపాటు సమర్ధవంతంగా నిర్వహిస్తే మూడు లేదా ఐదు సంవత్సరాల పాటు కొనసాగించే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నట్లు చెప్పారు. చివరకు తనతో గొడవకు దిగి ఉపాధ్యాయులు, విద్యార్థులకు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న మరో పాఠశాలకు మార్చిందన్నారు. తాను ఏర్పర్చిన కృష్ణవేణి స్కూల్కు రెండు నెలల్లో గుర్తింపు వస్తుందని.. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం చేరవేసిందన్నారు. అనుమతి లేకుండా కొనసాగుతున్న కృష్ణవేణి పాఠశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.