ఉమ్మడి జిల్లాలో 918 క్రీడా మైదానాలు
ABN , First Publish Date - 2022-05-23T05:30:00+05:30 IST
ఉమ్మడి జిల్లాలో 918 క్రీడా మైదానాలు
- ముమ్మరంగా స్థలాల అన్వేషణ ఫజూన్ 2న ప్రారంభించేందుకు సన్నాహాలు
తాండూరు, మే, 22 : పిల్లలు శారీరక దారుఢ్యం, మానసికోల్లాసంతో ఎదిగేందుకు సర్కారు క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. క్రీడా కమిటీలను ఏర్పాటు చేసి క్రీడలు నిర్వహించనుంది. సకల సదుపాయాలతో కూడిన, సమతూల్యమైన ఆట మైదానాల కోసం స్థలాల అన్వేషణ కూడా జరుగుతుంది. క్రీడా మైదానాలను అర ఎకరం స్థలంలో ఏర్పాటు చేయనున్నారు. వాటిని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఎంపిక చేసిన పట్టణాల్లో ఈ క్రీడామైదానాలను ప్రారంభించనున్నారు. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 918 క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లాలోని 16 మున్సిపాలిటీల్లో 417 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆవిర్భావ దినోత్సవం నాటికి 43, వికారాబాద్ జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీల్లో 97 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి, ఆవిర్భావ దినోత్సవం నాటికి 10 ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేడ్చల్ జిల్లాలో 13 మున్సిపాలిటీల్లో 404 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి 43 ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. అయితే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం అందుకు అయ్యే ఖర్చు వివరాలు, ఏనిధుల నుంచి ఖర్చు చేయాలనే స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ఈ విషయమై మున్సిపల్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రత్యేక నిధులు ఏమైనా విడుదల చేస్తారా అనేది తేలాల్సి ఉంది. నిధులకు తోడు వార్డుల్లో స్థలాల సేకరణ సాధ్యమవుతుందా అనే విషయం కూడా స్పష్టత లేదు.