కౌలు రైతుకు గుర్తింపేది?

ABN , First Publish Date - 2022-12-10T00:33:36+05:30 IST

సొంత భూములు లేక కౌలుపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించడం లేదు.

కౌలు రైతుకు గుర్తింపేది?

పంట అమ్ముకోవడానికి అవస్థలు

- ప్రతీ సీజన్‌లో ఎరువుల కోసం తిప్పలే..

- రుణాలు లేక ప్రైవేట్‌గా అప్పులు

కామారెడ్డి, డిసెంబరు 9 (ఆంఽధ్రజ్యోతి): సొంత భూములు లేక కౌలుపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించడం లేదు. పంటసాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం నుంచిసాకారం అందక, పండించిన పంట అధికారికంగా అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. భూ యజమానులైన రైతులకు ప్రభుత్వం సాగు కోసం అందించే తోడ్పాటు రైతుబంధు ముందుగానే చేతికి అందుతోంది. కష్టపడి పనిచేసే కౌలు రైతుకు ఎక్కడా సహయం అందడం లేదు. వ్యవసాయమే తప్ప ఇతర పని చేయలేని కౌలు రైతులంతా ఏడాదంతా కష్టపడి పండించిన పంటను అమ్మి అధిక శాతం వడ్డీకి తీసుకున్న ప్రైవేట్‌ అప్పులే తీరుస్తున్నారు.

జిల్లాలో 30వేలకు పైగా కౌలు రైతులు

జిల్లాలో 30వేలకు పైగా కౌలు రైతులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఇతరాత్ర రంగాలకు చెందిన వారు వ్యవసాయం చేసే ఆసక్తి లేకపోవడంతో పాటు సాగు కష్టాలను ఎదుర్కొనే పరిస్థితులు లేక తమ భూములను కౌలుకు ఇచ్చేస్తుంటారు. ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు విడతలుగా అందిస్తున్నా రైతుబంధు పంట సహాయం పట్టాదారు రైతుల ఖాతాల్లోనే జమ అవుతోంది. పంటను సాగు చేసిన కౌలు రైతు పేరే ఎక్కడా లేకుండా పోయింది. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధులో కౌలు రైతు ఊసేలేకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారుతుంది. పంటలు సాగు చే సి ఎరువులు, కలుపులు తీయాల్సిన పరిస్థితుల్లో పెట్టుబడి కోసం ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.బ్యాంకులు కూడా కౌలు రైతులకు రుణం ఇవ్వడం లేదు. గతంలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను జారీ చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా భూములన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేసి ధరణి పోర్టల్‌ ద్వారా పూర్తి వివరాలను ఉంచింది. కొత్తగా జారీ చేసిన డిజిటల్‌ పాసు పుస్తకాల్లో పట్టాదారు పేరు మినహ ఇతర కాలం ఎక్కడ లేదు. దీంతో కౌలు రైతుల గుర్తింపునకు శాశ్వతంగా అడ్డుకట్టపడింది.

పెరుగుతున్న పెట్టుబడులు

రోజు రోజుకూ పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఒక ఎకరంలో పత్తిపంట వేయాలంటే రూ.20 వేలు, వరి పొలానికి రూ.25 వేలు, మొక్కజొన్న చేనుకు రూ.20 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కౌలు డబ్బులు కాకుండా రైతు కుటుంబీకుల కష్టం పోను విత్తనాలు, ఎరువులకే అధిక పెట్టుబడి వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంత కష్టపడినప్పటికీ ఎకరానికి రూ.10వేల నుంచి రూ.15వేలు కూడా మిగిలే పరిస్థితి లేదు. కౌలు రైతులను గుర్తించి అర్హత కార్డులు ఇచ్చి ప్రభుత్వం బ్యాంకు రుణాలు అందేలా చూడాలని కౌలు రైతులు కోరుతున్నారు.

అమ్ముకోవడానికి సైతం తిప్పలు

కౌలు తీసుకున్న భూమిలో ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన కౌలు రైతులకు పంట అమ్ముకోవడానికి తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం ప్రతీ సీజన్‌లో ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏఏ పంట సాగుచేస్తున్నాడు అనే వివరాలను వ్యవసాయశాఖ అధికారుల ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. అధికారులు సైతం పట్టాపాసు పుస్తకం కలిగిన రైతుల వివరాలను మాత్రమే సర్వేలో నమోదు చేస్తున్నారు. తమకు రైతుబంధు ఎక్కడ రాదో అనే భయంతో పంట సాగు చేయకుండా పట్టా పాసుపుస్తకం ఉన్న భూ యజమానాలు సైతం కౌలు రైతు పంటను తమ పేరున నమోదు చేయించుకుంటున్నారు. వివరాలు అన్ని భూ యజమాని పేరు మీదుగా నమోదై ఉండడంతో కౌలు రైతు పంట విక్రయించే సమయానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కౌలు రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలు, సీసీఐ కేంద్రాల వద్ద విక్రయించేప్పుడు భూ యజమాని వివరాలు ముందస్తుగా ఉండడంతో వారి ఖాత్లాలోకి పంట విక్రయానికి సంబంధించిన సొమ్ము జమ అవుతోంది. తిరిగి వారి ఖాతాలో నుంచి తీసుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం జరిగినా పరిహారం సైతం కౌలుకు ఇచ్చిన భూ యజమానికే వర్తిస్తుందని కౌలు రైతులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-10T00:33:38+05:30 IST