సౌర విద్యుత్తో వెలుగులు
ABN , First Publish Date - 2022-06-11T07:27:22+05:30 IST
నేటి పోటీ ప్రపంచంలో విద్యుత్ వాడకంలో ఎన్నో రాష్ర్టాలు, దేశాలు, గ్రామాలు ఉన్నాయి. కానీ సౌర విద్యుత్ వాడకంలో దేశంలో పదుల సంఖ్యలోనే వాడుతున్న రాష్ర్టాలు కాని గ్రామాలు కాని కనిపిస్తుంటాయి.
- సౌర విద్యుత్తో అంకోల్ క్యాంపులో వెదజల్లుతున్న వెలుగులు
- విద్యుత్ ఆదాతో పాటు విద్యుత్ సంస్థకు అమ్ముకునే వీలుగా ఏర్పాటు
- ఇప్పటికే 14 కుటుంబాలు పూర్తిగా సౌర విద్యుత్నే వినియోగిస్తున్న వైనం
- సౌర విద్యుత్ బాటలో మరో 35 కుటుంబాలు
- రాష్ట్రంలోనే గ్రామాలకు దిక్సూచిగా మారిన అంకోల్ క్యాంపు
- నేడు సౌర విద్యుత్ ప్లాంట్లను సందర్శించనున్న స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్సీ
బాన్సువాడ, జూన్ 10: నేటి పోటీ ప్రపంచంలో విద్యుత్ వాడకంలో ఎన్నో రాష్ర్టాలు, దేశాలు, గ్రామాలు ఉన్నాయి. కానీ సౌర విద్యుత్ వాడకంలో దేశంలో పదుల సంఖ్యలోనే వాడుతున్న రాష్ర్టాలు కాని గ్రామాలు కాని కనిపిస్తుంటాయి. విద్యుత్ ఆదాతో పాటు విద్యుత్ సంస్థకు తిరిగి విద్యుత్ను అమ్ముకునే వీలుగా ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. విద్యుత్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ను వాడుకోకుండా సౌర విద్యుత్ వాడకం దిశగా అడుగులు వేసింది ఆ గ్రామం. ఆ గ్రామంలో ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు సౌర విద్యుత్ వాడకంలోనే ఉన్నాయి. అంతే కాకుండా విద్యుత్ను తిరిగి అమ్ముకునే దిశగా కృషి చేస్తున్న గ్రామంగా నిలుస్తోంది. ఇది ఎక్కడో కాదు కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంపు గ్రామం. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సౌర విద్యుత్తోనే కాంతి వెదజల్లుతోంది. ప్రతీ ఇంట్లో సౌర విద్యుత్ వాడకమే కాకుండా రాత్రి వేళల్లో విద్యుత్ స్తంభాల వెలుగులను కూడా సౌర విద్యుత్నే వినియోగిస్తున్నారు. అంతే కాకుండా గ్రామంలో మొత్తం 400 మంది జనాభా ఉన్నారు. ఇందులో 195 మంది పురుషులు, 205 మంది స్ర్తీలు ఉన్నారు. ఇప్పటికే గ్రామంలో 14 కుటుంబాలు పూర్తిగా సౌర విద్యుత్నే వినియోగిస్తున్నాయి. మరో 35 కుటుంబాలు కూడా సౌర విద్యుత్ బాటలోనే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11 కుటుంబాలు 3 కేవీ మిగతా కుటుంబాలు 2 కేవీ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు. అంతే కాకుండా విద్యుత్ను ఆదా చేసేందు కోసం సౌర విద్యుత్ను వినియోగిస్తున్నట్లు ఆ గ్రామస్థులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా ఆ గ్రామ సర్పంచ్ వెంకట్ రమణ సౌర విద్యుత్ వాడకాన్ని ప్రజలకు అలవాటు చేయడంతో పాటు విద్యుత్ సంస్థకు విద్యుత్ను అమ్ముకునే వీలు చేసేందుకు కృషి చేయడం అభినందనీయం. ఇప్పటికే ప్రతీ ఇంటిపై సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. 1 కేవీ సౌర విద్యుత్ ప్లాంటుకు రూ.60వేలు ఖర్చు అవుతుండగా 3 కేవీ ప్లాంటుకు రూ.1.80 లక్షలు ఖర్చు అవుతోంది. అయితే వీటన్నింటికీ రెడ్కో ద్వారా 40 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతోంది. అంతే కాకుండా 50శాతం స్ర్తీనిధి ద్వారా బ్యాంకు లోను లభిస్తోంది. మిగతా 10 శాతాన్ని లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. దీనిని సర్పంచ్ వెంకటరమణ ప్రతీ ఇంటింటికీ తిరుగుతూ సౌర విద్యుత్ వాడకాన్ని పెంపొందించాలని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడతామని ప్రజలకు అదర్శంగా నిలవడంతో పాటు రాష్ట్రంలోనే దిక్సూచి గ్రామంలో తీర్చి దిద్దడం జరుగుతుంది. అంతే కాకుండా ఈ సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు విషయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి సర్పంచ్ తీసుకెళ్లగా వెంటనే స్పందించిన స్పీకర్, స్ర్తీనిధి, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కంపెనీ వారితో మాట్లాడి ఏర్పాట్లు చేపట్టారు. దీంతో టాటా కంపెనీ వారు 25సంవత్సరాల పాటు వారంటీ ఇస్తూ బ్యాంకు ఇచ్చిన రుణంతో 5 సంవత్సరాల్లో రుణాలు చెల్లించాల్సి ఉంటుందని మిగతా 20 సంవత్సరాలు ఉచితంగా విద్యుత్ను వినియోగిస్తూ మిగతా విద్యుత్ను విద్యుత్ సంస్థలకు అమ్ముకుంటూ ప్రజలే నేరుగా డబ్బును సంపాదించుకునే ప్రణాళికను రూపొందించారు. దీంతో ప్రజలకు లాభం చేకూరుస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈ సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గ్రామాన్ని సందర్శించి సౌర విద్యుత్ ప్లాంట్లను పరిశీలించారు. విద్యుత్ వాడకాన్ని ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ద్వారా సౌర పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే అంకోల్ క్యాంపు గ్రామం సౌర విద్యుత్ వాడకంలో ఒక దిక్సూచిగా మారనుంది. త్వరలోనే గ్రామంలో మొత్తం కుటుంబాలు కూడా సౌర విద్యుత్ ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నారు.
నేడు సౌర విద్యుత్ ప్లాంట్లను సందర్శించనున్న స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్సీ కవిత
నసురుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపు గ్రామంలో ఏర్పాటు చేసిన టీఎస్ ఆర్ఈడీసీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంటు ప్రారంభోత్సవంతో పాటు గ్రామంలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న సౌర విద్యుత్ ప్లాంట్లను శనివారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా గ్రామంలో సభాస్థలి ఏర్పాట్లతో పాటు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పనులను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.