నేడు నూతన మండలాల ఏర్పాటు

ABN , First Publish Date - 2022-10-11T05:51:45+05:30 IST

జిల్లాలో మంగళవారం నుంచి కొత్త మండలాలు ఆలూరు, డొంకేశ్వర్‌లో పాలన మొదలుకానుంది. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డితో పాటు ఇతర అధికారులు నూతన మండలాలను ప్రారంభించనున్నారు.

నేడు నూతన మండలాల ఏర్పాటు

ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

నిజామాబాద్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మంగళవారం నుంచి కొత్త మండలాలు ఆలూరు, డొంకేశ్వర్‌లో పాలన మొదలుకానుంది. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డితో పాటు ఇతర అధికారులు నూతన మండలాలను ప్రారంభించనున్నారు. జిల్లాలోని ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ఆలూరు, డొంకేశ్వర్‌, బోధన్‌ నియోజకవర్గంలోని సాలూరా మండలాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఆలూరు, డొంకేశ్వర్‌లో మంగళవారం నుంచి తహసీల్దార్‌ కార్యాలయంలో పాలన మొదలుపెట్టేవిధంగా ఏర్పాట్లు చేశారు. తహసీల్దార్‌తో పాటు డీటీ, ఆర్‌ఐలతో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌లను, ఆఫీస్‌ సబార్డినేట్‌లను నియమించారు. తహసీల్దార్‌ కార్యాలయం, వ్యవసాయశాఖ కార్యాలయం, ఎస్‌హెచ్‌వో కార్యాలయం, మండల ప్రజాపరిషత్‌ కార్యాలయాన్ని దశల వారీగా ఏర్పాటు చేయనున్నారు. సాలూరా కూడా అన్ని కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. బాన్సూవాడ నియోజకవర్గం పరిధిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పొతంగల్‌ మండలానికి ఇప్పుడే నోటిఫికేషన్‌ విడుదల చేసినందున మరో నెలరోజుల తర్వాత ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది.

ఫలించిన ఆలూర్‌ వాసుల కల

ఆర్మూర్‌రూరల్‌: ప్రజల వినతుల మేరకు ఆలూర్‌ను మండలంగా ఏర్పాటు చేసింది. మంగళవారం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆలూర్‌లో తహసీల్దార్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.   ఆర్మూర్‌ మండలంలోని ఆలూర్‌ను ఏడు గ్రామాల్లో కలిపి మండలంగా ఏర్పాటు చేశారు. గతంలో ఆలూర్‌ను మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గజిట్‌ విడుదల చేయగానే తమ గ్రామం మండలంగా మారనుందని, వివిధ కార్యాలయాలకు భవనాలను సైతం గ్రామస్థులు సిద్ధం చేశారు. అప్పట్లో మండలాలు ఏర్పాటు చేసిన సమయంలో అధికారుల మధ్య సమన్వయ లోపంతో దూరంగా ఉన్న గ్రామాలను ఆలూర్‌ మండలంలో చేర్చడంతో ఆయా గ్రామాల ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పట్టుదలతో ఆలూర్‌ మండలాన్ని ఏర్పాటు చేయించారు. 

Updated Date - 2022-10-11T05:51:45+05:30 IST