సేవలకు ఆటంకం

ABN , First Publish Date - 2022-08-21T06:13:45+05:30 IST

రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇది వరకు శాఖలో కీలకంగా ఉన్న వీఆర్‌వోలను ప్రభుత్వం ఇతర శాఖలకు సర్దుబాటు చేయగా క్షేత్రస్థాయిలో విచారణలో ముందండే వీఆర్‌ఏలు తమ డిమాండ్ల సాఽధన కోసం సమ్మెబాట పట్టడం రెవెన్యూ పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

సేవలకు ఆటంకం
తాడ్వాయిలో నిరవధిక దీక్షలో కూర్చున్న వీఆర్‌ఏలు

- 27 రోజులుగా కొనసాగుతున్న వీఆర్‌ఏల నిరవధిక సమ్మె

- రెవెన్యూశాఖలో పేరుకుపోతున్న దరఖాస్తులు

- ధ్రువపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రజల ప్రదక్షిణలు


కామారెడ్డి, ఆగస్టు 20: రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇది వరకు శాఖలో కీలకంగా ఉన్న వీఆర్‌వోలను ప్రభుత్వం ఇతర శాఖలకు సర్దుబాటు చేయగా క్షేత్రస్థాయిలో విచారణలో ముందండే వీఆర్‌ఏలు తమ డిమాండ్ల సాఽధన కోసం సమ్మెబాట పట్టడం రెవెన్యూ పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యార్థుల చదువులకు, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్‌, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు కావాల్సిన ఆదాయ, కుల నివాసం వంటి ధ్రువపత్రాల జారీ గాడి తప్పింది. ఆయా పత్రాల కోసం ప్రజలు తహసీల్ధార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ధరణి పోర్టల్‌లోని గ్రీవెన్స్‌ పెండింగ్‌ భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిశీలనలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. వీఆర్‌ఏల సమ్మె ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.

ఖాస్రా, పహణీల పరిశీలన

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూశాఖ మీసేవ కేంద్రాల ద్వారా టీఎం 33 మాడ్యుల్‌ కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. వాటి పరిష్కారానికి 1954-55 నుంచి ఖాస్రా, పహణి పత్రాలు పరిశీలించాల్సి వస్తుండడంతో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు రోజుల తరబడి కాలయాపన జరుగుతోంది. రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. భూముల సర్వేకు సంబంధించి రైతులు మీసేవ ద్వారా దరఖాస్తులు చేసుకుంటున్నారు. వాటిని పరిశీలించాల్సి ఉండగా సహాయ సిబ్బంది లేక పక్కన పెడుతున్నారు. మరోదిక్కు ప్రభుత్వం వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నా నిరవధిక సమ్మె 27వ రోజుకు చేరుకుంది. ఆర్‌డీవో, తహసీల్ధార్‌ కార్యాలయాల ఎదుట సమ్మె కొనసాగిస్తున్నారు.

విచారణ చేసేదెవరు

గ్రామస్థాయిలో సమాచారం అందించడంలో వీఆర్‌ఏలు కీలకం. పేస్కేల్‌ అమలు, పదోన్నతులు, కారుణ్య నియామకాలు చేపట్టాలని వీఆర్‌ఏ జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూలై 25 నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటూ రెవెన్యూ అధికారులకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయి విచారణలను ఆర్‌ఐలు భుజాన వేసుకున్నారు. ప్రస్తుతం తహసీల్ధార్‌లు పూర్తిగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలోనే నిమగ్నవడంతో రెవెన్యూ భారం పూర్తిగా డిప్యూటీ తహసీల్ధార్‌లు, ఆర్‌ఐలపైనే పడుతోంది.


హామీలను నెరవేర్చాలి

- శ్రీకాంత్‌, వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు, భిక్కనూరు

ప్రభుత్వ వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాక నిరవధిక సమ్మె కొనసాగిస్తాం. నిత్యం 15 గంటల వరకు కష్టపడుతున్నా నెలకు రూ.10,500 వేతనం మాత్రమే ఇస్తున్నారు. వీఆర్‌వో వ్యవస్థ రద్దుతో మాపై పని భారం పెరిగింది.


అధికారులపై పని భారం

- గోవర్ధన్‌, తహసీల్ధార్‌, గాంధారి

వీఆర్‌ఏలు నిరవధిక సమ్మె కారణంగా అధికారులపై భారం పెరుగుతోంది. గ్రామస్థాయిలో లబ్ధిదారులు, బాధితుల గుర్తింపు, కళ్యాణలక్ష్మి, కులం, ఆదాయం, జనన, మరణ ధ్రువపత్రాలు, భూముల పట్టాల పరిశీలనకు ఆర్‌ఐలకు చేదోడుగా ఉండాల్సిన వీఆర్‌ఏలు సమ్మెకు వెళ్లడంతో అధికారులపై పనిభారం పడింది.

Updated Date - 2022-08-21T06:13:45+05:30 IST