చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి
ABN , First Publish Date - 2022-08-08T05:31:24+05:30 IST
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చే స్తోందని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంద ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం భువనగిరి శివారులోని రాయిగిరి కమాన్నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన చేనేత ర్యాలీని కలెక్టర్ పమేలాసత్పథితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
జాతీయ చేనేత దినోత్సవంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
భువనగిరి రూరల్, ఆగస్టు 7: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చే స్తోందని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంద ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం భువనగిరి శివారులోని రాయిగిరి కమాన్నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన చేనేత ర్యాలీని కలెక్టర్ పమేలాసత్పథితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సన్మానం, సబ్సిడీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభు త్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. పావలావడ్డీ కింద జిల్లాలో 16ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.110.41లక్షల నిధులను విడుదల చేసిందన్నారు. ‘నేతన్నకు చేయూత’ కింద పొదుపు ఖాతాల్లో సొమ్ము జమ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ చేనేత కార్మికుల కళానైపుణ్యానికి,సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రోత్సాహమిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నట్లు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవా న్ని పురస్కరించుకుని జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన 12మంది విద్యార్థులకు బహుమతులు ప్రదానంచేశారు. అదేవిధంగా ఎనిమిది మంది నేత కార్మికులను సన్మానించారు. ముందుగా చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన స్టాళ్లను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, మునిసిపల్ చైర్మన్, వైస్చైర్మన్లు ఎనబోయిన ఆంజనేయులు,కిష్టయ్య, ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ బీరుమల్లయ్య, జౌళీశాఖ సహాయ సంచాలకులు ఎం.వెంకటేశం పాల్గొన్నారు.
పుట్టపాక చేనేత కార్మికులకు జాతీయ అవార్డు
సంస్థాన్నారాయణపురం: జాతీయచేనేత దినోత్సవం సందర్భంగా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు కొలనుపెద్ద వెంకటయ్య, అతని కుమారుడు రవీందర్, గజం భగవాన్లు జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. దిల్లీలో కేంద్ర టెక్స్టైల్ శాఖమంత్రి పీయూష్ గోయల్ నుంచి చేనేత హ్యాండ్లూమ్ జాతీయ అవార్డును అందుకున్నారు. తండ్రీ కుమారులు పది నెలల పాటు శ్రమించి ప్రకృతి రంగులతో తేలియా రుమాలు చీరలను మగ్గంపై నేశారు. 2018లో ఈ చీర జాతీయ హస్తకళల పురస్కారానికి ఎంపికైంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ-2022 చేనేత అవార్డును పుట్టపాక గ్రామానికి చెందిన చేనేత కార్మికులు సామల వెంకటేశ్వర్లు ఆదివారం అందుకున్నారు. హైదరాబాద్లో జరిగిన చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ అవార్డును అందజేశారు. అవార్డుతోపాటు నగదు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహిత గజం గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.