సాగర్‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-08-16T06:33:52+05:30 IST

నాగార్జునసాగర్‌కు ఎగువనుంచి వరద ప్రవా హం కొనసాగుతోంది. సోమవారం శ్రీశైలం నుంచి సాగర్‌కు 4,39,596 క్యూసెక్కుల వరద రాగా, 26 క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

సాగర్‌కు కొనసాగుతున్న వరద
సాగర్‌ డ్యాం వద్ద పర్యాటకుల సందడి

ఐదో రోజూ 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల


నాగార్జునసాగర్‌, చింతలపాలెం, ఆగస్టు 15: నాగార్జునసాగర్‌కు ఎగువనుంచి వరద ప్రవా హం కొనసాగుతోంది. సోమవారం శ్రీశైలం నుంచి సాగర్‌కు 4,39,596 క్యూసెక్కుల వరద రాగా, 26 క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 585.40అడుగులుగా (298.5890టీఎంసీలు) ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వకు 8,604 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,541 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 30,450 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 2,400 క్యూసెక్కులు, వరద కాల్వ కు 300 క్యూసెక్కులు, 26 క్రస్ట్‌గేట్ల నుంచి 2,88,382 క్యూసెక్కులు మొత్తంగా 3,38,677 క్యూసెక్కు ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పెద్ద సంఖ్యలో వచ్చిన పర్యాటకులతో ప్రధాన డ్యాంపై భారీగా ట్రాఫిక్‌ నిలిచింది. ప్రధాన డ్యాం పైకి సుమారు 300 కార్లు, 500 ద్విచక్ర వాహనాలు వచ్చి ఉండవచ్చునని అధికారుల అంచనా. ఎన్నడూ లేనివిధంగా ప్రధాన డ్యాం పైకి ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలను అనుమతించడం ఏమిటని పలువురు పర్యాటకులు భయందోళనకు గురయ్యారు. అదేవిధంగా కొత్త వంతెన, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్ర మార్గం, బుద్ధవనం, పాత వంతెన వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. హిల్‌కాలనీ డౌన్‌ పార్కు వద్ద ఉన్న పర్యాటకశాఖ లాంచీ స్టేషన్‌ ద్వారా జలాశయం మధ్యలోని నాగార్జునకొండకు నాలుగు లాంచీ ట్రిప్పులను, జలాశయంలో మూడు జాలీ ట్రిప్పులను నడిపినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, పులిచింత ల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఆధికారులు 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 2,84,121 క్యూసెక్యుల వరద వస్తుండగా, 11 గేట్లను 3.5మీటర్లు ఎత్తి 2,78,121క్యూసెకులు, విద్యుత్‌ కేంద్రం ద్వారా 6,000 క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175అడుగులు(45.77టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 168.30అడుగులు(36.06టీఎంసీలు)గా ఉంది.

మూసీకి నిలకడగా ఇన్‌ఫ్లో

కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 2,093క్యూసెక్కులుగా ఉండగా, ప్రాజెక్టు మూడు గేట్లను అర అడుగు మేర ఎత్తి 1,341క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు(4.46టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 638.65అడుగులు(2.92టీఎంసీలు)గా ఉంది.

Updated Date - 2022-08-16T06:33:52+05:30 IST