ఉపఎన్నికకు ఏర్పాట్లు ముమ్మరం

ABN , First Publish Date - 2022-10-24T01:07:22+05:30 IST

రాష్ట్రంలో ఏకైక ఉప ఎన్నిక, అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉపఎన్నికకు ఏర్పాట్లు ముమ్మరం

విధుల్లో నిర్లక్ష్యం చూపితే వేటే

ఈవీఎంలలో బ్యాలెట్‌ సెట్టింగ్‌

ఓ వైపు నిఘా, మరో వైపు పోలింగ్‌ నిర్వహణకు సన్నాహాలు

స్వయంగా పర్యవేక్షించిన రాష్ట్ర ఎన్నికల అధికారి

ఓటర్లకు స్లిప్పుల పంపిణీ

నల్లగొండ, అక్టోబరు 23 : రాష్ట్రంలో ఏకైక ఉప ఎన్నిక, అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. డబ్బు, మద్యం ప్రవాహం జోరుగా ఉంటుదన్న ప్రచారం నేపథ్యంలో వాటిని ప్రత్యేక నిఘాతో అడ్డుకుంటూ పోలింగ్‌ నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బయటి నుంచి ఒత్తిళ్లు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చూపితే వేటు వేస్తూ పారదర్శకంగా ఎన్నికను నిర్వహించేందుకు ముందుకుసాగుతున్నారు. అందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల అధికారి శనివారం మునుగోడు నియోజకవర్గంలో పర్యటించి పోలింగ్‌ ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణకు ఇప్పటికే ఈవీఎంలు పూర్తిస్థాయిలో చేరుకున్నాయి. బ్యాలెట్ల ముద్రణ పూర్తికాగా, వాటిని బ్యాలెట్‌ యూనిట్లలో అమర్చుతున్నారు. ఈవీఎం బ్యాలెట్‌లో స్వతంత్ర అభ్యర్థికి ‘షిప్‌’కు బదులుగా ‘బోట్‌ విత్‌ మ్యాన్‌ అండ్‌ సెయిల్‌’ గుర్తు ముద్రణకు ఇచ్చినందుకు చౌటుప్పల్‌ తహసీల్దార్‌ పార్థసింహరెడ్డిని సస్పెండ్‌ చేసింది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్‌ గుర్తును మార్చడంపై రిటర్నింగ్‌ అధికారి జగన్నాథరావును సైతం ఆర్వో విధుల నుంచి తప్పించి ఆయన స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌ను నియమించింది. అంతేగాక మాజీ ఆర్వో జగన్నాథరావును సస్పెండ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఓటర్లకు పోలింగ్‌ స్లిప్పులను యుద్ధప్రాతిపదికన అధికారులు పంపిణీ చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌కృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓటర్‌ స్లిప్పుల పంపిణీని పర్యవేక్షిస్తుండగా, రెండు రోజుల్లో 72వేల ఓటర్‌ స్లిప్పుల పంపిణీ పూర్తయింది. పోలింగ్‌కు ఐదు రోజుల ముందే పోలింగ్‌ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వికా్‌సరాజ్‌ శనివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి పోలింగ్‌ స్లిప్పుల పంపిణీని స్వయంగా పర్యవేక్షించారు. అంతేగాక బూత్‌స్థాయి అధికారులకు పోలింగ్‌ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.

పటిష్ఠ నిఘా

చౌటుప్పల్‌ రూరల్‌: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఎన్నికల కమిషన్‌ ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకుంది. ఇప్పటికే ఉన్న పోలీస్‌ చెక్‌పోస్టులతోపాటు అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మండలాల సరిహద్దుల్లో మాత్రమే పోలీసు చెక్‌పోస్టులు ఉండగా సోమవారం నుంచి గ్రామ గ్రామాన చెక్‌పోస్టులు నిర్వహించనున్నారు. చౌటుప్పల్‌లో పంతంగి, తూప్రాన్‌పేట, పెద్దకొండూర్‌లో మాత్రమే చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇకపై మండలంలోని అన్ని గ్రామాల్లో చెక్‌పోస్టులు రానున్నాయి. ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఐ లేదా ఏఎ్‌సఐతోపాటు 5 నుంచి 10 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. వీరు గ్రామానికి వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తారు. ఇప్పటికే పలు చెక్‌పోస్టుల్లో భారీ మొత్తంలో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో రూ.77లక్షల నగదును స్వాధీనం చేసుకోగా, ఆదివారం చింతపల్లి మండలం వింజమూరు, సుద్దపల్లి సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు రూ.8లక్షల నగదును పట్టుకున్నారు. అదేవిధంగా ఇటీవల చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం ఓటర్లను యాదగిరిగుట్ట దేవాలయం దర్శనానికి బస్సుల్లో తరలించడంపై ఎన్నికల సంఘం విచారణ నిర్వహించింది. మల్కాపురం గ్రామ ఇన్‌చార్జిగా వ్యవరిస్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఈనెల 20న 15 బస్సుల్లో ఓటర్లను యాదగిరిగుట్టకు తరలించగా, ఆ ఖర్చును అభ్యర్థి వ్యయంలో నమోదుచేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. మద్యం అమ్మకాలను కట్టడి చేసేందుకు ఆబ్కారీశాఖను అప్రమత్తం చేసి అదనంగా మరో తొమ్మిది తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

మునుగోడు ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికా్‌సరాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈవీఎంలు, పోస్టర్‌ బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ పూర్తయిందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం కమిషనింగ్‌ ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ నాటికి ఈవీఎంల కమిషన్‌ పూర్తవుతుందని తెలిపారు. ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తయిందని 35 శాతం అదనపు ఈవీఎంలు, వీవీ ప్యాట్లను రిజర్వు అధికారికి కేటాయించామన్నారు. 1207 బీయూలు, 403 సీయూలు, 403 వీవీ ప్యాట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్‌ ఈ నెల 20వ తేదీనే పూర్తి చేసి పోలింగ్‌ స్టేషన్ల వారీగా కేటాయించామని తెలిపారు. పోలింగ్‌ సిబ్బందికి ఈ నెల 27 నుంచి 28వ తేదీ వరకు రెండో విడత శిక్షణ ఇస్తామని తెలిపారు. మూడు బ్యాలెట్‌యూనిట్లను ఎలా కనెక్ట్‌ చేయాలో ప్రిసైడింగ్‌ అధికారులకు వివరిస్తామన్నారు. ఇంకా 25 శాతం రిజర్వుతో పాటు అవసరమైన సంఖ్యలో పోలింగ్‌ సిబ్బందిని నియమించినట్లు ఆయన వివరించారు. 80 ఏళ్లు పైబడిన 345 మంది ఓటర్లు, 394 మంది దివ్యాంగుల ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయడానికి నిర్ణీత సమయంలోగా ఫారం-12డీని సమర్పించాలన్నారు. సీనియర్‌ సిటీజన్లు, దివ్యాంగుల ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌లు వేయడానికి షెడ్యూల్‌ను సిద్ధం చేశామన్నారు.

Updated Date - 2022-10-24T01:32:18+05:30 IST