పాఠశాలల ఆన్లైన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-07-07T05:53:33+05:30 IST
మన ఊరు-మనబడి, మనబస్తీ-మనబడి కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల ఆన్లైన్ నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు.
కలెక్టర్ రాహుల్శర్మ
నల్లగొండ టౌన్, జూలై 6: మన ఊరు-మనబడి, మనబస్తీ-మనబడి కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల ఆన్లైన్ నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మనఊరు - మనబడి, మన బస్తీ-మనబడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో కొనసాగుతున్న పనులపై ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ మండలంలో ఇంజనీర్లు తమకు కేటాయించిన ఎంపీడీవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్లను సమన్వయం చేసుకుని పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంజనీర్లు ఆయా పాఠశాలలకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన అదనపు తరగతి గదుల నిర్మాణానికి తగిన ప్రణాళిక వేసుకుని ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఆఫ్లైన్లో ఎన్ఆర్ఈజీఎ్స పనులకు అడ్మినిస్ట్రేషన్ అనుమతి పొందిన తర్వాత ఆన్లైన్ ప్రక్రియలో ఎలా నమోదు చేయాలో ఒకటి, రెండు సార్లు సరిచూసుకుని నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆన్లైన్ పనుల వివరాలను తెలిపారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ నరేందర్రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ తిరుపతయ్య, విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాల సంస్థ ఈఈ అనిత పాల్గొన్నారు.