నార్కట్పల్లి సర్పంచ్ సస్పెన్షన్
ABN , First Publish Date - 2022-01-21T07:20:14+05:30 IST
నార్కట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దూదిమెట్ల స్రవంతిని ఆరు నెలలపాటు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
నార్కట్పల్లి, జనవరి 20: నార్కట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దూదిమెట్ల స్రవంతిని ఆరు నెలలపాటు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ నిధులు రూ.14,91,239లను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ వార్డు సభ్యులు గత ఏడాది ఆగస్టు 17వ తేదీన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్రెడ్డి సెప్టెంబరు 29వ తేదీన సర్పంచ్కు షోకాజ్ నోటీస్ జారీచేశారు. అందుకు ఆమె ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవటంతో అక్టోబరు 25వ తేదీన సర్పంచ్ చెక్పవర్ రద్దు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచ్ స్రవంతిని సస్పెండ్ చేస్తున్నట్లు డిసెంబరు 9వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించగా డీపీవో జారీచేసిన ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో డిసెంబరు 20వ తేదీన ఆమె సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా నిధుల వినియోగానికి సంబంధించిన రికార్డులను అందజేయకపోవడంతో సర్పంచ్ స్రవంతిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఈ నెల 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఉపసర్పంచ్ సిర్పంగి స్వామికి సర్పంచ్గా బాధ్యతలు అప్పగించాలని, ఎంపీడీవోకు సూచించారు. అదేవిధంగా ఎంపీడీవోతో కలిపి చెక్ పవర్ను కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ స్రవంతి రెండున్నర సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.