నిరుపేదలకు అధికారపార్టీ నేత టోకరా
ABN , First Publish Date - 2022-12-07T00:32:02+05:30 IST
నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇంటిని ఇప్పిస్తానని ఓ అధికార పార్టీ నేత డబ్బులు వసూలు చేసి టోకరా ఇచ్చాడు.
డబుల్బెడ్రూం ఇప్పిస్తామని డబ్బు వసూలు
మోసంచేశాడని మోదిన్పురం జంగాల కాలనీ వాసుల ఆవేదన
సోషల్ మీడియాలో వీడియో వైరల్
చివ్వెంల, డిసెంబరు 6: నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇంటిని ఇప్పిస్తానని ఓ అధికార పార్టీ నేత డబ్బులు వసూలు చేసి టోకరా ఇచ్చాడు. ఒకొక్కరి నుంచి రూ.25వేలు మొదలు రూ.30వేల వరకు వసూలు చేసినట్టు బాధితులైన మోదిన్పురం గ్రామం బుడగజంగాల కాలనీ వాసుల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విషయం వెలుగుచూసింది.
పేదల ఇంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇంటిని నిర్మించి ఇస్తోంది. గ్రామాల్లో అర్హులను రెవెన్యూశాఖ అధికారులు గుర్తించి ఎలాంటి పైరవీలకు తావులేకుండా లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపికచేసి ఇంటిని కేటాయిస్తారు. మండలంలోని మోదిన్పురం గ్రామంలో బుడగజంగాల కులస్థుల కోసం 2017లో 50 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. వీటి నిర్మాణం దాదాపు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇదే అదునుగా ఓ అధికార పార్టీ నేత రంగంలోకి దిగాడు. మరో బుడగజంగాల కులస్థుడి సాయం తీసుకున్నాడు. డబుల్బెడ్రూం ఇళ్లను ఇప్పిస్తానని డబ్బు వసూలు చేశాడు. ప్రజాప్రతినిధులు, అధికారులందరూ తనకు తెలుసని నమ్మబలికి ఖర్చులు ఉంటాయని ఒకొక్కరి నుంచి రూ.25వేలు మొదలు రూ.30వేల వరకు వసూలు చేసినట్టు సమాచారం. అయితే జంగాల కుల దైవం మీద ప్రమాణం చేసి మరీ ఇంటిని ఇప్పిస్తానని డబ్బు తీసుకున్నట్టు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే ఇల్లు రాలేదని తమను నిందించొద్దని వారిని మోసం చేసినట్టు వారు చెబుతున్నారు. ఈ విషయంపై అతడిని నిలదీయగా, పంచాయతీ కార్యాలయంలో అందరి ముందు అతడు డబ్బు తీసుకున్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నట్టు బాధితులు చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నల్లా, విద్యుత్ మీటర్లు ఇప్పిస్తానని కూడా సదరు నేత నగదు వసూలు చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. తమ నగదును తిరిగి ఇప్పించాలని, అర్హులైన తమకు డబుల్బెడ్రూం కేటాయించాలని బాధితులు కోరుతున్నారు. ఇదే విషయమై మోదిన్పురం సర్పంచ్ నంద్యాల జనార్ధన్రెడ్డిని, తహసీల్దార్ రంగారావును వివరణ కోరాగా వారు ఈ విషయంపై స్పందించలేదు.