‘మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి’

ABN , First Publish Date - 2022-02-19T07:18:00+05:30 IST

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని మండలంలోని ఇస్తాళపురంలో గ్రామస్థులు ఆందోళన చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

‘మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి’

ఆత్మకూర్‌(ఎస్‌), ఫిబ్రవరి 18: మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని మండలంలోని ఇస్తాళపురంలో గ్రామస్థులు ఆందోళన చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్‌ మండలం గుండ్లసింగారం గ్రామం వద్ద ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి ఆకారపు పరమేష్‌(17) బైక్‌పై వస్తూ ట్రాక్టర్‌ను ఢీకొట్టి మృతి చెందాడు.  దీంతో పోస్టుమార్టం అనంతరం న్యాయం చేయాలని ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఇస్తాళాపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ యజమాని మర్రు రామారావు ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించడానికి మృతదేహంతో కుటుంబ సభ్యులు బయలుదేరారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు ఇస్తాళాపురం స్టేజీ వద్ద మృతదేహంతో వస్తున్న వారిని అడ్డుకున్నారు. నూతనకల్‌ ఎస్‌ఐ ప్రసాద్‌, తుంగతుర్తి ఎస్‌ఐ ఆంజనేయులు, నాగారం ఎస్‌ఐ హరికృష్ణ, ఆత్మకూర్‌(ఎస్‌) ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డిలు తమ సిబ్బందిని మోహ రించినప్పటికీ మృతుడి బంధువులు పోలీసులను ఒక్కసారిగా పక్కకు తోసి ఇస్తాళాపురంలోని ట్రాక్టర్‌ యజమాని ఇంటికి చేరుకుని అక్కడ పరమేష్‌ మృతదేహంతో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆందోళన చేశారు. మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తానని ట్రాక్టర్‌ యజమాని అంగీకరించడంతో ఆందోళనను విరమించారు.




Updated Date - 2022-02-19T07:18:00+05:30 IST