రోడ్ల నిర్వహణ, మరమ్మతులపై దృష్టి సారించాలి
ABN , First Publish Date - 2022-09-20T05:23:27+05:30 IST
రోడ్ల నిర్వహణ, మరమ్మతులపై దృష్టి సారించాలని నీతి ఆయోగ్ బృందం జిల్లా అధికారులకు సూచించింది. వెనకబడిన జిల్లాలకు కేంద్రం కేటాయిస్తు
నీతి ఆయోగ్ డిప్యూటీ అడ్వయిజర్ బిశ్వనాథ్ బిషోయ్
నూతనంగా నిర్మించిన రోడ్ల నాణ్యతను పరిశీలించిన కేంద్ర బృందం
యాదాద్రి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రోడ్ల నిర్వహణ, మరమ్మతులపై దృష్టి సారించాలని నీతి ఆయోగ్ బృందం జిల్లా అధికారులకు సూచించింది. వెనకబడిన జిల్లాలకు కేంద్రం కేటాయిస్తున్న (స్పెషల్ అసిస్టెంట్ ఫర్ డెవల్పమెంట్ ఆఫ్ మైన్ బ్యాక్వర్డ్ డిస్ర్టిక్ట్ ఆఫ్ తెలంగాణ) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఈ బృందం సోమవారం పరిశీలించింది. నీతి ఆయోగ్ డిప్యూటీ అడ్వయిజర్ డాక్టర్ బిశ్వనాథ్ బిషోయ్తో పాటు ఆరుగురు సభ్యుల బృందం జిల్లా అధికారులతో కలిసి ప్రధానంగా నూతనంగా నిర్మించిన రోడ్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసింది. గుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన రాయగిరి-వడాయిగూడెం బీటీ రోడ్డును, అనంతరం భువనగిరి మండలం రాయగిరి నుంచి మోత్కూరు వరకు రూ.10కోట్లతో ఐదున్నర కిలోమీటర్లు చేపట్టిన రోడ్డును, అదేవిధంగా భువనగిరి-చిట్యాల రహదారిలో రూ.5.4కోట్లతో చేపట్టిన 15కిలోమీటర్ల రోడ్డును సభ్యులు పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించారా? గడువులోగా పూర్తి చేశారా? ఏమైనా దెబ్బతిన్నాయా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలతో రోడ్లు నిర్మించేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లాలో పరిశీలించిన రోడ్లపై నీతి ఆయోగ్ బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించనుంది. నీతి ఆయోగ్ అధికారుల బృందం వెంట ఆర్అండ్బీ ఈఈ శంకరయ్య ఉన్నారు.