ఖాళీగా ఉన్న స్థానాలకు ఉపఎన్నిక
ABN , First Publish Date - 2022-04-05T05:47:17+05:30 IST
జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచ్, మునిసిపల్ వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి
భువనగిరి రూరల్, ఏప్రిల్ 4: జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచ్, మునిసిపల్ వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి సూచించారు. హైదరాబాద్ నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ముసాయిదా ఓటరు జాబితా ఈనెల 8వ తేదీన ఎంపీడీవో, పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలన్నారు. ఈనెల 12న జిల్లాస్థాయి, 13న మండలస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్నారు. 16వ తేదీ వరకు ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించాలని, 19వ తేదీలోగా పరిష్కరించి 21వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రదర్శించాలన్నారు. ఎన్నికల సామగ్రి సిద్ధం చేసుకుని జిల్లాలో ఓటరు తుది జాబితాను పంచాయతీ ఆఫీసుల్లో, జిల్లా వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని గుర్తించాలని సూచించారు. ఈ నెల 23నాటికి ఎంపీటీసీ స్థానాలకు, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితా విడుదల చేసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను ముందుగానే ఎంపిక చేసుకోవాలని, ఎన్నికల వివరాలను ఎప్పటికప్పుడు టీ-పోల్లో నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, జిల్లాలో 4 సర్పంచ్, 148 వార్డు సభ్యుల స్థానాలు కలిపి మొత్తం 152 ఖాళీగా ఉన్నాయన్నారు. జనవరి 5న వెలువరించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం అభ్యంతరాలు స్వీకరించి, పరిష్కరించి 22న తుది జాబితా విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీడియోకాన్ఫరెన్స్లో డీపీవో సునంద, డీఎల్పీవో సాధన తదితరులు పాల్గొన్నారు.