భువనగిరి-గజ్వేల్ రహదారి గుంతలమయం
ABN , First Publish Date - 2022-09-08T05:56:28+05:30 IST
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని భువనగిరి-గజ్వేల్ రహదారిపె గుంతలు పడి ప్రమాదకరంగా మారింది.
తుర్కపల్లి, సెప్టెంబరు 7: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని భువనగిరి-గజ్వేల్ రహదారిపె గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళల్లో ఈ రోడ్డుపై పడ్డ గుంతలు వాహన దారులకు కనిపించక పోవడంతో గుంతల్లో పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినా ప్రజాప్రతినిధులు, ఆర్అండ్డీ అధికారులు పట్టించుకోవడంలేదు. వాహనదారులు గుంతులను తప్పింకునే క్రమంలో రోడ్డు పక్క నుంచి వాహనాలను తోలుతున్నారు. మండలంలోని ముల్కలపల్లి జేతురాంతండా, తుర్కపల్లి-వాసాలమర్రి గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ సమీపంలో పడ్డ గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు, సం బంధిత అదికారులు స్పందించి రోడ్డుపై పడ్డ గుంతలకు మరమ్మతు పనులు చేయించి, ప్రమాదాలు జరుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్డుకు మరమ్మతులు చేయాలి
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడుపైపడిన గుంతలు వాహన దారులకు ఇబ్బందికరంగా మారాయి. రాత్రి పూట వర్షాలు పడి ఆ గుంతలు నీటితో నిండడం వల్ల అది గమనించకుండా ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కింద పడి గాయాల పాలవుతున్నారు. అధికారులు స్పందించి, రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టి ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాలి.
-కొక్కొండ లక్ష్మీనారాయణ, బీజేపీ మండల అధ్యక్షుడు
రెండుమూడు రోజుల్లో మరమ్మతు పనులు చేయిస్తాం
తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డుపై పడ్డ గుంతలకు రెండు మూడు రోజుల్లో మరమ్మతు పనులు చేపడతాం. రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున గుంతల్లో మాల్ వేసినా ఉండదు. మండల కేంద్రం నుంచి వాసాలమర్రి వరకు కిలోమీటర్ దూరం వరకు రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టడానికి నిధుల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
- ఎనహెచ రోడ్డు డీఈఈ రామకృష్ణ