Amit Shah tour schedule: తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్..
ABN , First Publish Date - 2022-08-19T17:20:02+05:30 IST
మునుగోడు ఉప ఎన్నిక తేదీ ఖరారుకాకున్నా బహిరంగ సభల సందడి ఊపందుకుంది.
హైదరాబాద్ (Hyderabad): మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక (By Election) తేదీ ఖరారుకాకున్నా బహిరంగ సభల సందడి ఊపందుకుంది. పోలింగ్ సమీపించిందనే స్థాయిలో ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే నియోజకవర్గమంతా కలియతిరుగుతున్నారు. మునుగోడులో ఈనెల 20న సీఎం కేసీఆర్ (CM KCR), 21న కేంద్ర హోంమంత్రి అమిత్షా (Amit Shah) బహిరంగ సభలు ఉన్నాయి. సీఎం సభ రోజే ప్రతీ గ్రామంలో ఒక కాంగ్రెస్ (Congress) దిగ్గజంతో పాదయాత్ర నిర్వహించాలని పీసీసీ (PCC) నిర్ణయంతో నియోజకవర్గంలో హడావిడి నెలకొంది. మరోవైపు ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు, సభలకు జనాల తరలింపునకు పెద్ద సంఖ్యలో ఆర్థిక లావాదేవీలు జరుగుతుండడంతో మునుగోడు వేడి సర్వత్రా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటన అధికారిక షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 21వ తేదీ మధ్యహాన్నం 3.40 గంలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 4.25 గంలకు మునుగోడుకు వెళ్తారు. 4.35 గంటల నుంచి 4.50 వరకు సీఆర్పీఎఫ్ అధికారులతో రివ్యూ నిర్వహిస్తారు. 4.50 గంటల నుంచి 6 గంటలకు వరకు మునుగోడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి 6.45 గంటల నుంచి 7.30 వరకు రామోజీ ఫీల్ సిటీలో పర్యటిస్తారు. అనంతరం శంషాబాద్ నోవోటల్ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. మునుగోడు ఉప ఎన్నిక, రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు. రాత్రి 9.40 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.