నిర్లక్ష్యం వీడేనా?
ABN , First Publish Date - 2022-11-24T23:49:25+05:30 IST
డిసెంబరు 18వతేదీన స్వామివారి కల్యాణంతో కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడునెలల జాతరకు అంకురార్పణ జరగనున్నది. కనీస వసతుల కల్పనలో ఏటా ఆలయవర్గాలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
మల్లన్న జాతరకు ఏటా నామమాత్రపు చర్యలు
నేడు ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం
చేర్యాల, నవంబరు 24 : డిసెంబరు 18వతేదీన స్వామివారి కల్యాణంతో కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడునెలల జాతరకు అంకురార్పణ జరగనున్నది. కనీస వసతుల కల్పనలో ఏటా ఆలయవర్గాలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నేడు మల్లన్న ఆలయంలో ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో జాతర ఏర్పాట్లకు తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొన్నది.
అడుగడుగునా సమస్యలే
మల్లన్న దర్శనార్థం కొమురవెల్లికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ రహదారి గుండా మూడు మార్గాల్లో కొమురవెల్లికి భక్తులు చేరుకుంటారు. పోలీసులు ఆయా మార్గాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలు లోపలికి రాకుండా అరకిలోమీటరు దూరంలో నిలిపివేస్తున్నారు. దీంతో సామగ్రిని వెంటబెట్టుకుని కాలినడకన వెళుతూ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల కోసం లాకర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం లేదు. దాసారంగుట్ట అప్రోచ్రోడ్డు, గదుల విచారణ, బుకింగ్ కార్యాలయం, ప్రసాద విక్రయశాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాజీవ్రహదారి స్వాగతతోరణం నుంచి ఆలయం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.10.32కోట్లు నిధులు మంజూరైనా పనులు ప్రారంభించలేదు. ప్రైవేటు గదుల యాజమానులు అద్దె దోపిడీ నియంత్రణకు తీసుకున్న చర్యలను అమలు చేయాల్సి ఉంది. భక్తుల ప్రయోజనం కోసం క్యూకాంప్లెక్స్ నిర్మాణంతో పాటు 75 గదుల సత్ర భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినా నిధులు మంజూరు కాలేవు. అలాగే నాలుగేళ్లు కావస్తున్నా 50 గదుల సత్రం నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాల బుకింగ్ టికెట్ల రీసైక్లింగ్ అవకతవకలను అరికట్టాలి. తలనీలాల సమర్పణలో నాయిబ్రాహ్మణులు, పట్నాల వద్ద పలువురు ఒగ్గుపూజారులు, సెల్ఫోన్ డిపాజిట్ కౌంటర్ నిర్వహకుల అక్రమ వసూళ్లను నియంత్రించాలి. సాఽధారణ రోజుల్లో నిత్యం 100 మందికి, జాతర వారాల్లో 500 మందికి అన్నదానం చేస్తామని రెండేళ్లక్రితం మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ ప్రకటించినప్పటికీ అమలుకు నోచుకోలేదు. జాతర వారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రైవేటు గదులనుంచి డ్రైనేజీ నీరు ఆరుబయట బహిరంగ ప్రదేశాలలో ప్రవహిస్తోంది. డ్రైనేజీ నీటిని మల్లన్న చెరువులోకి మళ్లిస్తుండటంతో చెరువు మలినమవుతుంది.
అమ్మవార్లకు కిరీటం ఏర్పాటేది?
మల్లన్నకు భక్తులు సమర్పించిన 8కిలోల బంగారం ఉండగా స్వామివారికి కిలోన్నర పరిమాణంతో బంగారు కిరీటాన్ని చేయిస్తున్నారు. కానీ అమ్మవార్లకు కిరీటం ఏర్పాటుకు మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మొక్కుబడిగా స్వామివారి హుండీలలో వేసే కోరమీసాల విక్రయంలో గుత్తేదారులు వెండికి బదులు రూ.20 విలువ చేయని సత్తురేకులను రూ.200వరకు విక్రయిస్తూ దోచుకుంటున్నారు.