పాములొస్తున్నాయని పల్లె ప్రకృతివనం ధ్వంసం
ABN , First Publish Date - 2022-08-10T05:19:41+05:30 IST
ప్రకృతి వనం పాముల వనంగా తయారయిందని, ప్రకృతివనాన్ని ధ్వంసం చేసి, పాములు పట్టుకుని కాలనీవాసులు నిరసన తెలిపిన సంఘటన కౌడిపల్లి మండలం రాజీపేటలో మంగళవారం జరిగింది.
రాజీపేటలో పాములను పట్టుకొని నిరసన
వార్డుప్రజలపై పోలీసులకు సర్పంచ్ ఫిర్యాదు
కౌడిపల్లి, ఆగస్టు 9: ప్రకృతి వనం పాముల వనంగా తయారయిందని, ప్రకృతివనాన్ని ధ్వంసం చేసి, పాములు పట్టుకుని కాలనీవాసులు నిరసన తెలిపిన సంఘటన కౌడిపల్లి మండలం రాజీపేటలో మంగళవారం జరిగింది. రాజీపేట 3వ వార్డులో పల్లె ప్రకృతివనాన్ని ఏర్పాటు చేశారు. అందులో నుంచి తరచూ ఇళ్లలోకి కొండచిలువలు, పెంజరలు వస్తున్నాయని వార్డుప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని సంవత్సరం నుంచి గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదని వార్డుప్రజలు తెలిపారు. ప్రకృతి వనం నుంచి ఇళ్లల్లోకి వస్తున్న పాములతో ప్రమాదం పొంచిఉందని, అంతేకాకుండా ప్రకృతి వనంలో పెంచే మొక్కల నుంచి వచ్చే గాలిని పీల్చుకుని విష జ్వరాలతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ప్రకృతి వనంలో ఉన్న చెట్లను వార్డుప్రజలు నరికేసి, పాములను పట్టుకొని నిరసన తెలిపారు. దాదాపు 1,100 చెట్లను నరికి వాటిని తొలగించినందుకు వార్డుప్రజలపై గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశారు.