ఫలించిన మల్లన్న భక్తుల ఏడేళ్ల నిరీక్షణ
ABN , First Publish Date - 2022-08-08T05:00:31+05:30 IST
కొమురవెల్లి మల్లన్న భక్తుల ఏడేళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది.
డబుల్ రోడ్డు విస్తరణ పనులకు రూ.10.32 కోట్ల నిధులు మంజూరు
కేసీఆర్ హామీ.. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ
తీరనున్న భక్తుల రోడ్డు కష్టాలు
చేర్యాల, ఆగస్టు 7: కొమురవెల్లి మల్లన్న భక్తుల ఏడేళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చొరవతో డబుల్ రోడ్డు విస్తరణకు మోక్షం కలిగింది. రాజీవ్ ర హదారి నుంచి మల్లన్న ఆలయం వరకు గల సింగిల్ లేన్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.10.32 కోట్లు నిధులు మంజూరు చేసింది. దీంతో మరికొద్దిరోజుల్లో విస్తరణ పనులు ప్రారంభం కానుండటంతో మల్లన్న భక్తులకు ప్రయాణ కష్టాలు తొలగిపోనున్నాయి.
2014లో నెక్లె్స రోడ్డు ప్రకటన
మల్లన్న ఆలయానికి రాజీవ్ రహదారి మీదుగా హైదరాబాద్, కరీంనగర్ వైపు నుంచి, వరంగల్ వైపు నుంచి చేర్యాల మీదుగా భక్తులు చేరుకుంటారు. మూడుదారులు మల్లన్న ఆలయం చుట్టూ హారం మాదిరిగా ఉండడంతో నెక్లెస్ రోడ్డుగా పిలుస్తారు. ప్రత్యేక రాష్ర్ట్ర ఏర్పాటు అనంతరం తొలిసారి 2014లో మల్లన్న కల్యాణానికి సీఎం కేసీఆర్ పట్టువస్త్రాలు సమర్పించిన నేపథ్యంలో సెంట్రల్ లైటింగ్తో కూడిన నాలుగులైన్ల నెక్లెస్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రకటించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా నిధులు మంజూరు కాలేదు. దీంతో కొండపాక స్వాగతతోరణం నుంచి ఆలయం వరకు 4.80 కిలోమీటర్ల మేర సింగిల్ లేన్ రోడ్డు దెబ్బతిన్నది. గుంతలమయమై ప్రమాదకరంగా మారింది. సైడు బర్ములు దెబ్బతినడంతో యేటా జాతర సమయంలో భక్తులకు తిప్పలు తప్పడం లేదు. సాధారణ రోజుల్లోనూ రద్దీ అధికమవడంతో నానాతంటాలు పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతుండటంతో రోడ్డు విస్తరణ పనులు ఆవశ్యమయ్యాయి.
నెరవేరిన సీఎం కేసీఆర్ హామీ
కొముర వెల్లి మల్లన్న పేరిట మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. కొద్దిరోజుల క్రితం సీఎం కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించి ప్రత్యేక కళశాలలో గోదావరి నీళ్లను తీసుకొచ్చి మల్లన్నకు అభిషేకించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ రాజీవ్ రహదారి స్వాగత తోరణం నుంచి మల్లన్న ఆలయం వరకు గల సింగిల్ లేన్ బీటీరోడ్డు మీదుగా ఆలయానికి చేరుకున్నారు. రోడ్డుపాడై ప్రమాదాలకు నిలయంగా మారిందని, విస్తరణ పనులకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విన్నవించడంతో సీఎం కే సీఆర్ హామీఇచ్చారు. దీంతో అధికారులు కసరత్తు పూర్తిచేసి సెంట్రల్ లైటింగ్, డివైడర్లతో కూడిన నాలుగులేన్ల రోడ్డుకు రూ.20 కోట్లమేర ప్రతిపాదనను సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ మేరకు మంత్రి హరీశ్రావు చొరవ వహించి ప్రాధాన్యతగా రూ.10.32 కోట్లు నిధులు మంజూరు చేయించారు. దీంతో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరగా, టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి మరికొద్దిరోజుల్లో పనులు ప్రారంభించనుండటం వలన భక్తులు ఇక సాఫీగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.
మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ధన్యవాదాలు
త్వరితగతిన డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి రూ.10.32 కోట్లు నిధులు మంజూరు చేయించిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ధన్యవాదాలు. ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు విస్తరణ పనులకు మోక్షం కలగడంతో భక్తుల ప్రయాణ కష్టాలు తీరిపోతాయి.
- గీస భిక్షపతి, మల్లన్న ఆలయ కమిటీ తాజామాజీ చైర్మన్