రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా పేరు నిలబెట్టాలి
ABN , First Publish Date - 2022-05-25T05:52:07+05:30 IST
రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విద్యార్థులకు సూచించారు.
రాష్ట్ర మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట అగ్రికల్చర్, మే 24: రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విద్యార్థులకు సూచించారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ జిల్లా అధికారి సరోజాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ వసతిగృహ విద్యార్థులకు జిల్లాస్థాయి వేసవి సాంస్కృతిక (సమ్మర్ కార్నీవాల్) పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్రావు హాజరై ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక, దేశభక్తి గేయాల నృత్యాలను తిలకించిన అనంతరం వారిని అభినందిస్తూ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ పోటీల్లో గెలుపొందిన బృందాల విద్యార్థులకు ఈ నెల 31న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రాష్ట్రస్థాయి సమ్మర్ కార్నీవాల్ పోటీలను నిర్వహిస్తారన్నారు. ఆ పోటీల్లో సిద్దిపేట జిల్లా పేరు నిలబెట్టాలని మంత్రి వారికి సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడానికి వెళ్లే రవాణా, వసతి ఖర్చులను తానే భరిస్తానని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, బీసీ వసతి గృహాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
నిరుద్యోగ అభ్యర్థులకు ఆత్మీయ పలకరింపు
బాబు జగ్జీవన్ రామ్ భవన్లో కేసీఆర్ ఉచిత పోలీసు కానిస్టేబుల్ శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగ అభ్యర్థులకు భోజనాన్ని మంత్రి హరీశ్రావు వడ్డించారు. విపంచి కళానిలయం ప్రాంగణంలో కానిస్టేబుల్ శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగ అభ్యర్థులు భోజనం చేస్తుండగా మంత్రి హరీశ్రావు వెళ్లి.. కుశల ప్రశ్నలతో ఆత్మీయంగా పలకరిస్తూ కొసరి కొసరి వడ్డించారు. శిక్షణ, భోజనాలు, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయని మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సరోజాదేవి పాల్గొన్నారు.