తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడి కన్నుమూత
ABN , First Publish Date - 2022-03-04T05:44:23+05:30 IST
రాష్ట్ర సాధన కోసం తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారుడు పులుగు కిష్టయ్య(74) అనారోగ్యంతో గురువారం కన్ను మూశారు.
పులుగు కిష్టయ్య మృతికి ప్రముఖుల సంతాపం
జోగిపేట, మార్చి 3: రాష్ట్ర సాధన కోసం తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారుడు పులుగు కిష్టయ్య(74) అనారోగ్యంతో గురువారం కన్ను మూశారు. అందోల్ మండలం జోగిపేటకు చెందిన కిష్టయ్య 1948లో జన్మించారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన కిష్టయ్య టీఎన్జీవో సంఘంలో చేరి దాదాపు రెండు దశాబ్దాల పాటు అందోల్ తాలుకా టీఎన్జీవో సంఘం అధ్యక్షుడిగాను, ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు. తెలంగాణ సాధనలో తొలిదశ ఉద్యమంలో యువకుడిగా ఉన్న కిష్టయ్య హుషారుగా ఉద్యమించి పలుమార్లు జైలు కెళ్లారు. 2001లో ప్రస్తుత సీఎం కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2006 నుంచి 2014 వరకు అందోల్ అసెంబ్లీ నియోజక వర్గ ఇన్చార్జిగా బాధ్యతలను చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న కిష్టయ్య అరుదైన ఘనతను సాధించారు. ఉద్యమంలో భాగంగా నిర్వహించిన సకలజనుల సమ్మెలో వంటావార్పు, మిలియన్ మార్చ్, ధూమ్ దాం తదితర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న కిష్టయ్య ప్రజలను చైతన్య పరిచారు. అనంతరం తెలంగాణ సాధన కోసం నిరాహార దీక్షను సైతం చేపట్టడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. మృతి చెందిన కిష్టయ్యకు భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డితో పాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. కిష్టయ్య అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.