రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి: మెదక్ ఎస్పీ
ABN , First Publish Date - 2022-05-19T05:17:29+05:30 IST
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు.
తూప్రాన్, మే 18: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. ఓ ప్రమాదం ఓ తరంపై ప్రభావం చూపుతుందని అందువల్ల ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. బుధవారం తూప్రాన్ పోలీసు సబ్ డివిజన్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత మూడేళ్లలో జరిగిన నేరాలను పరిశీలించగా క్రైం రేటులో తగ్గుదల లేదన్నారు. ఈ విషయమై సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ప్రధానంగా భూ సమస్యల ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సైబర్ క్రైమ్లు తక్కువగా నమోదవుతున్నాయని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రతీనెల మొదటి బుధవారం అవేర్నె్సడే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో నేరాలు, సామాజిక సమస్యల అంశాలపై కళాబృందంతో మేలుకొలుపు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో తూప్రాన్ డివిజన్ పరిధిలో 41 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, స్పీడ్ గన్స్ పెట్టి రోడ్డు ప్రమాదాలు తగ్గిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. సమీక్షాసమావేశంలో తూప్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ సీఐలు పాల్గొన్నారు.