ఎస్ఎన్సీయూ సేవల్లో సిద్దిపేట నంబర్ 1
ABN , First Publish Date - 2022-03-06T05:17:05+05:30 IST
నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో శిశువులకు అందుతున్న వైద్య సేవలపై జాతీయ నియోనాటాలజీ ఫోరమ్(ఎన్ఎన్ఎఫ్) బృందం ఇటీవలె సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి(ఎస్ఎన్సీయూ) లెవల్2ఏ గుర్తింపును పొందింది. ఎన్ఎన్ఎఫ్ బృందం చేపట్టిన సర్వేలో ఎస్ఎన్సీయూకు రాష్ట్రంలో మొదటి ర్యాంకును ప్రకటించింది. ఈ మేరకు శనివారం రాత్రి జాతీయస్థాయిలో స్కోరింగ్, ర్యాంకింగుల వారీగా జాబితాను ఎన్ఎన్ఎఫ్ వెలువరించింది.
ర్యాంకులు ప్రకటించిన జాతీయ నియోనాటాలజీ ఫోరం
హర్షం వ్యక్తంచేసిన మంత్రి హరీశ్రావు
సిద్దిపేట టౌన్, మార్చి 5 : నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో శిశువులకు అందుతున్న వైద్య సేవలపై జాతీయ నియోనాటాలజీ ఫోరమ్(ఎన్ఎన్ఎఫ్) బృందం ఇటీవలె సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి(ఎస్ఎన్సీయూ) లెవల్2ఏ గుర్తింపును పొందింది. ఎన్ఎన్ఎఫ్ బృందం చేపట్టిన సర్వేలో ఎస్ఎన్సీయూకు రాష్ట్రంలో మొదటి ర్యాంకును ప్రకటించింది. ఈ మేరకు శనివారం రాత్రి జాతీయస్థాయిలో స్కోరింగ్, ర్యాంకింగుల వారీగా జాబితాను ఎన్ఎన్ఎఫ్ వెలువరించింది. వారంలోపు వివరణాత్మక నివేదిక సమర్పిస్తామని తెలిపారు. రూ.45వేల రివార్డు బహుమతి అందించనున్నామని ఎన్ఎన్ఎఫ్ పేర్కొన్నది.
కేఎంసీ పద్ధతిలో శిశువుల సంరక్షణ
సిద్దిపేట ఎస్ఎన్సీయూలో కంగారు మదర్ కేర్(కేఎంసీ) పద్ధతిలో వైద్యులు శిశువులకు రక్షణ అందిస్తున్నారు. నెలలు నిండకుండానే పుట్టినబిడ్డలకు, తల్లులకు, అలాగే తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు ఎస్ఎన్సీయూ వార్డులో ప్రత్యేక వైద్య సదుపాయలు అందిస్తున్నారు. ఇటీవలే ఎన్ఎన్ఎఫ్ బృందం రాష్ట్రంలోని పది నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను ఎంపిక చేసి సర్వే చేపట్టారు. పలు అంశాల్లో సిద్దిపేట ఎస్స్ఎన్సీయూ మంచి పనితీరుతో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ర్యాకింగ్లో సిద్దిపేట జనరల్ ఆసుపత్రి మొదటి స్థానం దక్కడంతో వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అలాగే వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తమిళఅరసు స్పందిస్తూ కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఎస్ఎన్సీయూలో చేరిన శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సేవలకు గుర్తింపుగా మొదటి ర్యాంకు రావడం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్రావు స్పందిస్తూ రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సిద్దిపేట ఎస్ఎన్సీయూ కేంద్రానికి దక్కడం ఆనందంగా ఉందన్నారు. ఎస్ఎన్సీయూ వైద్య అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎస్ఎన్సీయూ పసిబిడ్డల పాలిట వరమని, ఈ కేంద్రంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థికభారం, దూరభారాన్ని తగ్గించి, మెరుగైన వైద్య సేవలను స్థానికంగానే అందుబాటులోకి వచ్చాయన్నారు.