‘టెట్’ ఫలితాల్లో కేసీఆర్ కోచింగ్ సెంటర్ హవా
ABN , First Publish Date - 2022-07-02T05:16:09+05:30 IST
టెట్ అర్హత పరీక్షలో సిద్దిపేటలోని కేసీఆర్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సొంత ఖర్చులతో నిర్వహిస్తున్న ఈ కోచింగ్ సెంటర్లో 60 రోజుల పాటు 617 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఇందులో 518 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
ఉచిత శిక్షణతో సత్తాచాటిన విద్యార్థులు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూలై 1 : టెట్ అర్హత పరీక్షలో సిద్దిపేటలోని కేసీఆర్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సొంత ఖర్చులతో నిర్వహిస్తున్న ఈ కోచింగ్ సెంటర్లో 60 రోజుల పాటు 617 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఇందులో 518 మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ ఫలితాలు పేపర్-1లో 32 శాతం, పేపర్-2లో 49 శాతం నమోదు కాగా ఈ కోచింగ్ సెంటర్కు సంబంధించి 84 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. అత్యుత్తమ ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పించడమే ఈ ఫలితాలను సాధించడానికి ప్రధాన కారణం. 60 రోజుల పాటు నిరంతరం జరిగిన ఈ శిక్షణలో ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వలేదు. రెగ్యులర్గా మాక్ టెస్టులు నిర్వహించడం వల్ల టెట్ అభ్యర్థులు పట్టు సంపాదించారు. కఠినమైన ప్రశ్నలు వచ్చినప్పటికీ సత్ఫలితాలు రావడానికి మాక్ టెస్టులే కారణం. అవనిగడ్డ, హైదరాబాద్కు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకునే స్థోమత లేని పేదవారి కోసం మంత్రి హరీశ్రావు ఈ ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీరోజు భోజనం పెట్టించారు. అంతేగాకుండా పలుమార్లు కోచింగ్ సెంటర్ను ఆకస్మికంగా సందర్శించి మార్గనిర్ధేశనం చేశారు. కోచింగ్ వచ్చిన విద్యార్థులకు తోడు మరో 100 మందికి అంటే దాదాపు 700 మంది విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ను అందజేశారు.
హరీశ్ సార్కు చాలా థ్యాంక్స్
నేను మొదట్లో హైదరాబాద్లోని ఒక కోచింగ్ సెంటర్కు వెళ్లాను. కానీ అక్కడ బాగా చెప్పలేదు. ఆ తర్వాత హరీశ్రావు సార్ సిద్దిపేటలో కోచింగ్ ఇప్పిస్తున్నారని తెలిసి ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాసయ్యాను. మొదటి క్లాస్ విన్నాక ఇక్కడే శిక్షణ పొందాలని డిసైడ్ అయ్యాను. ప్రతీరోజు అన్నం పెట్టి, మెరుగైన శిక్షణ అందించారు. ఫ్యాకల్టీ కూడా అద్బుతంగా చెప్పారు. నాకు గతంలో 109 మార్కులు రాగా ఇప్పుడు 117 మార్కులు వచ్చాయి. ఉపాధ్యాయురాలు కావాలనే నా లక్ష్యానికి దగ్గరగా చేరుకున్నాను. హరీశ్ సార్కు చాలాచాలా థ్యాంక్స్.
- కొటారికారి మీనా
‘టెట్’లో 6,235 మందికి అర్హత
టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు(టెట్) పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చెందిన 6,235 మంది విద్యార్థులు అర్హత సాధించారు. జూన్ 12వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు సంబఽంధించిన ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. జిల్లా నుంచి పేపర్-1లో 9,351 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 2,906 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కేవలం 31.08 శాతం అర్హత నమోదైంది. ఇక పేపర్-2లో 7,257 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 3,329 మంది అర్హత పొందారు. 45.87 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఈ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సిద్దిపేట జిల్లా వెనుకబడింది. పేపర్-1లో 27వ స్థానం, పేపర్- 2లో కూడా 27వ స్థానం దక్కించుకుంది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులు మాత్రమే టీఆర్టీ పరీక్షకు అర్హులు.