కబ్జాల కంత్రీకిరణ్
ABN , First Publish Date - 2022-10-01T04:48:26+05:30 IST
అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ భూ కబ్జాలు చేసే కంత్రీ కిరణ్గా మారాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా జోగిపేటలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు.
దళితుల పక్షాన క్రాంతికిరణ్ ఏనాడూ మాట్లాడ లేదు
జర్నలిస్టులకూ న్యాయం చేయని ఎమ్మెల్యే
కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ భూముల కబ్జా
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శ
జోగిపేట, సెప్టెంబరు 30: అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ భూ కబ్జాలు చేసే కంత్రీ కిరణ్గా మారాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా జోగిపేటలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. అధికారంలోకి రాగానే కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎక్కడ ప్రభుత్వ స్థలం కన్పించినా జెండా పాతేస్తున్నారని మండిపడ్డారు. దళితుడై ఉండి అసైన్డ్ భూములనూ వదలడం లేదని, చెరువులు, కుంటలను చెరబడుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఆయన సోదరులు పండిత పుత్ర పరమశుంఠ అన్నట్టు తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఈ మాట తానన్నది కాదని, ఎమ్మెల్యే తండ్రే అన్నారని పేర్కొన్నారు. ఏనాడూ దళితుల హక్కుల కోసం పోరాడలేదని, దళితులపై దాడులు జరుగుతున్నా ప్రశ్నించలేదని, నేరెళ్ల, మరియమ్మ ఘటనలపై కూడా నోరు మెదపలేదని అన్నారు. జర్నలిస్టు కోటాలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న క్రాంతికిరణ్ ఏనాడూ జర్నలిస్టులను పట్టించుకోలేదని విమర్శించారు. పైగా తనను ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు పెట్టడం, ఉద్యోగాల్లోంచి తీసేయిస్తున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసమే ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం చేపట్టిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతీ ఇంట్లో అర్హులందరికీ ప్రతి నెలా రూ. 3 వేల ఫించన్ ఇస్తామని ప్రకటించారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని కొన్యాల నుంచి అల్మాయిపేటలో అందోలు నియోజకరవర్గంలో పాదయాత్ర ప్రవేశించింది. అభిమానులు ఆమెను గజమాలతో సత్కరించి ఆహ్వానించారు. దారి పొడుగునా మహిళలు, రైతులు, యువకులతో మాట్లాడుతూ సమస్యలు తెలసుకున్నారు. అనంతరం జోగిపేటలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్టీపీ రాష్ట్ర నాయకులు రామిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, ఏపూరి సోమన్న, నాయకులు రాంగల్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.