బంజారాలతో కలిసి స్టెప్పులేసిన జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2022-02-17T05:24:53+05:30 IST
సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి బంజారాలతో కలిసి స్టెప్పులేశారు.
తండాల్లో సేవాలాల్, రామ్రావ్ కాంస్య విగ్రహాల ఏర్పాటు
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఆంఽధజ్యోతిప్రతినిధి, సంగారెడ్డి, ఫిబ్రవరి16: సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి బంజారాలతో కలిసి స్టెప్పులేశారు. జయంతి సందర్భంగా బంజారాలు సంగారెడ్డిలోని గణే్షనగర్ నుంచి హాస్టల్ గడ్డ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా నిర్వహిస్తుండడం అభినందనీయమని జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో సేవాలాల్ మందిర నిర్మాణానికి రూ.50లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా గిరిజన సంక్షేమశాఖ అధికారికి సూచించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసే వరకు తాను సొంతంగా రూ.25 లక్షలతో సేవాలాల్ మందిరాన్ని నిర్మిస్తానన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 35 తాండాలున్నాయని, అన్నితండాల్లో సంత్ సేవాలాల్ మహరాజ్, రామ్రావ్ మహరాజ్ల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తానన్నారు.
గృహనిర్మాణ శాఖ అధికారులతో జగ్గారెడ్డి సమీక్ష
పట్టణంలోని బైపా్సరోడ్డు రెవెన్యూ కాలనీలో 2005లో రాజీవ్ గృహకల్ప కింద నిర్మించి నిరుపయోగంగా ఉన్న ఇళ్ల గురించి సంగారెడ్డి కలెక్టరేట్లో గృహనిర్మాణశాఖ అధికారులతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు ఎందుకు అప్పగించలేదని జగ్గారెడ్డి గృహనిర్మాణశాఖ కోఆర్డినేటర్ ప్రసాద్, మేనేజర్ శ్రీనివాస్ ప్రసాద్ను ప్రశ్నించారు. స్పందించిన అధికారులు ఇక్కడ 242మందికి గృహాలను అప్పగించాల్సి ఉందని, నిధులు సరిపోక పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని వివరించారు. అసంపూర్తి పనుల కోసం రూ.5కోట్లు కేటాయించాలని 2018లో ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. మున్సిపల్ నుంచి ఎల్ఆర్ఎస్ నిధులు కేటాయించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ తమకు తిరిగి పంపగా మున్సిపల్ నిధులు లేవని ఆ శాఖ అధికారులు తెలియజేయడంతో పనులు సాగడం లేదని వివరించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న గృహాలతో పాటు డ్రైనేజీ, తాగునీటి సరఫరా కోసం రూ.10 కోట్లతో అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, తాను కేసీఆర్ను, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి నిధులు తెప్పించేందుకు కృషి చేస్తానన్నారు. పదేళ్ల క్రితం రామేశ్వరబండలో రాజీవ్ గృహకల్ప ఇళ్ల కోసం డబ్బు చెల్లించిన 392 మందికి అక్కడ నివాసాలను ఎందుకు కేటాయించలేదని అధికారులను జగ్గారెడ్డి వివరణ కోరగా, పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన వారికి మాత్రమే రామేశ్వరం బండలో ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వల్ల స్థానికేతరులకు కేటాయించలేకపోయామని డీసీవో ప్రసాద్ తెలిపారు. వారందరికీ వారు నివసించే ప్రాంతాల్లోనే డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాధితులకు భరోసా ఇచ్చారు.