జీపు చోరీ కేసులో అంతర్‌జిల్లా దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2022-10-08T05:08:00+05:30 IST

రామాయంపేటలో జరిగిన జీపు చోరీ కేసులో పోలీసులు 48 గంటల్లో అంతర్‌జిల్లా దొంగను వాహనంతో సహా పట్టుకున్నారు

జీపు చోరీ కేసులో అంతర్‌జిల్లా దొంగ అరెస్టు
నిందితుడిని చూపుతున్న సీఐ చంద్రశేఖర్‌ రెడ్డి

నిందితుడిపై మూడు జిల్లాల్లో 25 కేసులు 

రామాయంపేట, అక్టోబరు 7: రామాయంపేటలో జరిగిన జీపు చోరీ కేసులో పోలీసులు 48 గంటల్లో అంతర్‌జిల్లా దొంగను వాహనంతో సహా పట్టుకున్నారు. శుక్రవారం సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేశ్‌  వివరాలను వెల్లడించారు. ఈ నెల 3న పట్టణానికి చెందిన ఎండీ రజాక్‌ జీపు(తూఫాన్‌)ను స్థానిక ప్రభుత్వ జూనియర్‌  కళాశాల వద్ద పార్కింగ్‌ చేశాడు. దసరా పండుగకు వేరే ప్రాంతానికి వెళ్లి రెండు రోజుల తర్వాత వచ్చి చూడగా జీపు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నిందితుడి  వివరాలను సేకరించారు. ఎస్‌ఐ తన సిబ్బందితో వెళ్లి నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సేవాలాల్‌ తండాకు చెందిన దుర్గాప్రసాద్‌ అలియాస్‌ దుర్గ అలియాస్‌ వంశీ అలియాస్‌ దీపక్‌ను పట్టుకున్నారు. అలాగే తండాలోని ఓ గుడిసెలో దాచి ఉంచిన జీపును సైతం స్వాధీనపర్చుకున్నట్టు తెలిపారు. సదరు నిందితుడిపై నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఇప్పటికే 25 కేసులు నమోదు అయినట్లు సీఐ, ఎస్‌ఐలు తెలిపారు. అతడిని రిమాండ్‌ పంపినట్లు వారు పేర్కొన్నారు.  

Updated Date - 2022-10-08T05:08:00+05:30 IST